ఢాకా: వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సంబంధించి ఐసీసీ ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వినూత్న ప్రతిపాదన ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడలేమని చెబుతున్న బంగ్లా తమ జట్టును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మార్చాలని కోరింది. శనివారం ఢాకాలో జరిగిన కీలక భేటీలో ఐసీసీ ప్రతినిధుల ముందు ఈ మేరకు ప్రతిపాదన చేసింది.
తమను గ్రూప్–బికి మార్చి.. అందులో ఉన్న ఐర్లాండ్ను గ్రూప్–సిలో చేర్చాలని కోరింది. తద్వారా కోల్కతా, ముంబై లో జరగాల్సిన తమ మ్యాచ్లను శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె తరలించే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే, టోర్నీ ప్రారంభానికి (ఫిబ్రవరి 7) కొద్ది రోజులే సమయం ఉన్నందున, షెడ్యూల్లో ఇలాంటి మార్పులు చేసేందుకు ఐసీసీ ఒప్పుకునే చాన్స్ కనిపించడం లేదు.
