- ప్రభుత్వానికి క్రెడాయ్ వినతి
హైదరాబాద్, వెలుగు: కన్స్ట్రక్షన్ రంగం కోసం తెచ్చిన టీఎస్– బీ పాస్ విధానంలో కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గం వెల్లడించింది. పాత పద్దతి కొనసాగిస్తూనే, టీఎస్– బీ పాస్ అమలు చేయాలని కోరనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు బిజీగా ఉండటంతో టీఎస్– బీ పాస్అమలులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని చెప్పారు. అంతేకాదని, చాలా చోట్ల తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఏర్పాటు కాలేదని వివరించారు. దేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలు, సిటీలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ సహా తెలంగాణలోనే జోరు మీదుందని, ఈ రంగం ఇక్కడ మరింత ఎదుగుతుందనే ఆశాభావం ఉందని పేర్కొన్నారు.
క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీ హెచ్ రామచంద్రా రెడ్డి, ప్రెసిడెంట్డీ మురళీ కృష్ణా రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ ప్రేమ్సాగర్ రెడ్డి, సెక్రటరీ కే ఇంద్ర సేనా రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు బాగా ఎదగడం మన రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొస్తోందని వారు పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రూల్స్, రెగ్యులేషన్స్నూ క్రెడాయ్ మెంబర్స్ పాటిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుండటంతోనే ముందుకెళ్లగలుగుతున్నామని ప్రెసిడెంట్ మురళీ కృష్ణా రెడ్డి చెప్పారు. తెలంగాణలో 33 జిల్లాలుండగా ప్రస్తుతం 11 జిల్లాల్లో క్రెడాయ్ చాప్టర్లున్నాయని, రాబోయే రెండేళ్లలో మరో 9 జిల్లాలలో చాప్టర్లు ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని అన్నారు. హైదరాబాద్ సిటీలో చాలా స్కై స్క్రాపర్లు (ఎత్తైన భవనాలు) వస్తున్నాయని, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం మరింతగా ఊపందుకుంటోందని చైర్మన్ రామచంద్రా రెడ్డి చెప్పారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి సిటీలలో కూడా ఈ రంగం దూసుకుపోతోందని పేర్కొన్నారు.