గోధుమ పిండికి తీవ్రమైన కొరత
మూతపడ్డ 2,500 ‘నాన్’ షాపులు
ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డ ప్రతిపక్షాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రజలకు చపాతీ కష్టాలు వచ్చాయి. దేశంలో గోధుమపిండి కొరత ఏర్పడటంతో చపాతీ లవర్స్ లబోదిబోమంటున్నారు. గోధుమ పిండి కోసం లైన్లలో నిలబడి కేజీకి రూ.43 పెట్టి మరీ పిండి కొనుక్కుంటున్నారు. మరి కొంతమంది చేసేదేమీ లేక అతికష్టంమీద రైస్ వండుకుని తింటున్నారు. పాకిస్తాన్ మార్కెట్లో గోధుమపిండి నిల్వలు లేకపోవడంతో మూడు నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాటికి కొరత తీవ్రమైందని అధికారులు చెప్పారు. గోధుమ పిండి కొరతతో పాకిస్తాన్– బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్సుల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చపాతీలు, నాన్ల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఖైబర్ పక్తుంఖ్వాలో దాదాపు 2500 నాన్బయిస్ (నాన్లు తయారు చేసే షాపులు, ఇవి పాకిస్తాన్లో చాలా ఫేమస్) ను మూసేశారని డాన్ పత్రిక ప్రచురించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాన్బయి అసోసియేషన్ ఆందోళన నిర్వహించింది. సింధ్ రాష్ట్రంలో మార్చి 20 నాటికి, పంజాబ్లో ఏప్రిల్ 15 కల్లా గోధుమ పంట చేతికి వస్తుందని, దీంతో కొరత తీరిపోతుందని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సరైన సమయంలో దీనిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇబ్బంది తలెత్తిందని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు ఆరోపించాయి. ప్రభుత్వ అసమర్థత వల్లే గోధుమపిండి సంక్షోభం ఏర్పడిందని పాక్ ముస్లిం లీగ్ నవాజ్ నాయకుడు షాబాజ్ షరీఫ్ ఇమ్రాన్ఖాన్ విమర్శించారు. 40వేల టన్నుల గోధుమలను ఆఫ్గనిస్తాన్కు ఎగుమతి చేయడం వల్ల దేశంలో సంక్షోభం ఏర్పడిందని పీపీపీ చైర్మన్ భుట్టో–జర్దారీ విమర్శించారు.