కాంగ్రెస్​ వైపు మజ్లిస్ ఎమ్మెల్యే చూపు!

కాంగ్రెస్​ వైపు మజ్లిస్ ఎమ్మెల్యే చూపు!

పార్టీ నేతల మధ్య ముదురుతున్న వివాదం
టికెట్​ ఇవ్వకపోతే హస్తం పార్టీలో చేరేందుకు 
రెడీగా ఉన్న చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ​

హైదరాబాద్, వెలుగు: ​చార్మినార్​ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ సీనియర్ ​నేత ముంతాజ్ ఖాన్​కాంగ్రెస్​లో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎంఐఎం నుంచి ఆయనకు చార్మినార్ టికెట్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన కొడుకు ఇంతియాజ్​ఖాన్​కు టికెట్లు ఇవ్వాలని ముంతాజ్​ ఖాన్ కోరారని, కాంగ్రెస్​నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ముంతాజ్​ఖాన్ కాంగ్రెస్​లో చేరితే ఆయనకు చార్మినార్, ఆయన కొడుకు ఇంతియాజ్​కు యాకుత్​పురా నుంచి పోటీకి అవకాశంకల్పిస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.

దీంతో ముంతాజ్​ఖాన్.. ​మజ్లిస్​  అధినేత అసదుద్దీన్, ఎమ్మెల్యే  అక్బరుద్దీన్​తో ఏదో విషయం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముంతాజ్ ​ఖాన్ ​పార్టీలో చాలా సీనియర్ ​నేత. గతంలో సలావుద్దీన్​ఓవైసీతోనూ కలిసి పని చేశారు. మజ్లిస్​తో అమానుల్లాఖాన్ ​విభేదించి ఎంబీటీ పార్టీని ఏర్పాటు చేయడంతో ఆయనకు మద్దతుగా ముంతాజ్ ఉన్నారు. 1994లో ముంతాజ్​ఖాన్ యాకుత్​పురా నుంచి ఎంబీటీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ  మజ్లిస్​లో చేరారు. ఐదు సార్లు యాకుత్​పురా, చార్మినార్ ​నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈసారి మజ్లిస్ పార్టీ ​తన సీనియారిటీని గౌరవించడం లేదనే అసంతృప్తితో ముంతాజ్ ఖాన్ ఉన్నారు. ఆయన కాంగ్రెస్​లో చేరితే పాతబస్తీ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.