రన్ వేపై ఆగిన చార్టర్ ఫ్లైట్..పైనే చక్కర్లు కొట్టిన మరో రెండు విమానాలు  

రన్ వేపై ఆగిన చార్టర్ ఫ్లైట్..పైనే చక్కర్లు కొట్టిన మరో రెండు విమానాలు  
  • మరో మూడు విమానాల టేకాఫ్​కు ఆలస్యం 
  •  నెట్టుకుంటూ పక్కకు తొలగించిన రన్​వే స్టాఫ్​

శంషాబాద్, వెలుగు: టేకాఫ్ తీసుకుంటున్న టైమ్​లో ఓ చార్టర్​ఫ్లైట్​రన్​వేపై అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో గాల్లో తిరుగుతున్న రెండు విమానాలు కిందికి రాకుండా పైనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేకాఫ్​కు సిద్ధంగా ఉన్న పలు విమానాలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్​పోర్ట్​అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శంషాబాద్​ఎయిర్​పోర్టుకు రాయ్​పూర్​నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఐదుగురు ప్రయాణికులతో ఫ్లాప్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ చార్టర్​ఫ్లైట్​వచ్చింది.

ఈ విమానంలో  బ్రిజ్​కౌశిక్​అనే పేషెంట్​ను తీసుకువచ్చారు. ఈ విమానం మూడున్నర గంటలకు మళ్లీ రాయ్​పూర్​వెళ్లడానికి సిద్ధమైంది. ఇందులో ఇద్దరు పైలట్లతో ఓ పేషెంట్​, ఓ డాక్టర్, మరొక వైద్య సిబ్బంది ఉన్నారు. రన్​వేపై ప్రయాణం మొదలుపెట్టిన కొద్ది సెకన్లకే  విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆగిపోయింది. ఈ కారణంగా శంషాబాద్ ఎయిర్​పోర్టులో దిగాల్సిన రెండు విమానాలు ఐదు నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే, ఎయిర్​పోర్ట్​నుంచి బయలుదేరాల్సిన మరో మూడు విమానాలు ఆగిపోయాయి. కొద్దిసేపటికి చార్టర్​ఫ్లైట్​ను నెట్టుకుంటూ పక్కకు తొలగించి రన్​వే క్లియర్​చేశారు. దీంతో పైన తిరుగుతున్న రెండు విమానాలు సేఫ్​గా ల్యాండ్​అయ్యాయి.