
- నేను వచ్చాకే అన్నీ బంద్ చేయించిన
- బీఆర్ఎస్ హయాంలో ఇసుక, బియ్యం దందాలు నడిచినయ్
- అందరూ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలి
- ఆదివాసీ కార్మిక సంఘం నేత విక్రమ్ రావును గెలిపించాలి
- ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ లేబర్ యూనియన్ ఎన్నికల ప్రచారానికి హాజరు
బెల్లంపల్లి/కోల్బెల్ట్, వెలుగు: కార్మికుల హక్కుల కోసం కొట్లాడే కుటుంబం తమది అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా వెంకటస్వామి చూపిన మార్గంలోనే కార్మిక వర్గానికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నడిచిన ఇసుక, భూములు, బియ్యం దందాలను బంద్ చేయించానని అన్నారు. కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఆదివాసీ లేబర్ యూనియన్కు వివేక్ వెంకటస్వామి మద్దతు ప్రకటించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాసిపేట మండలం మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావు.. ఆదివాసీ సంఘాల తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకు అందరూ మద్దతుగా నిలవాలి. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి.
కార్మిక హక్కుల కోసం పోరాడే విక్రమ్ రావునే అభ్యర్థిగా నిలబెట్టినం. సిమెంట్ ఫ్యాక్టరీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం మేమంతా కలిసి కృషి చేస్తాం. ఆదివాసీ సంఘాలన్నీ ఐక్యంగా నిలబడాలి. విక్రమ్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి’’అని కార్మికులను వివేక్ కోరారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి తన జీవితకాలం అంతా కార్మికుల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన సింగరేణి సంస్థ మూతపడకుండా లక్ష మంది ఉద్యోగాలు కాపాడారని అన్నారు. ‘‘బొగ్గు గని కార్మికులకు పెన్షన్, పీఎఫ్ స్కీమ్లు తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుంది. రామగుండంలో మూతపడిన ఆర్ఎఫ్సీఎల్ రీ ఓపెన్ చేయడానికి కాకా వెంకటస్వామి, నేను ఎంతో కృషి చేశాం. జైపూర్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటులోనూ మా కుటుంబం ఎంతో కృషి చేసింది. కార్మికుల పక్షాన పోరాడేతత్వాన్ని నాన్న వెంకటస్వామి నుంచి నేను నేర్చుకున్న’’అని వివేక్ అన్నారు. సరస్వతీ పుష్కరాల్లో భాగంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఆయన స్పందించారు. ప్రొటోకాల్ విషయంలో అందరూ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. తలొగ్గకుండా ఇసుక, భూములు, బియ్యం దందాలను అడ్డుకున్నట్లు చెప్పారు. తమపై ఐఎన్టీయూసీ విమర్శలు చేయడం వెనుక కుట్ర దాగుందని అన్నారు. విమర్శల వెనుక మరొకరి హస్తం ఉందని తెలిపారు.
ఆదివాసీలు ఐక్యంగా ఉండాలి: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
దేవాపూర్ సిమెంట్ కంపెనీలో ఆదివాసీ కార్మికులే ఎక్కువగా ఉంటారని, వారి హక్కులు, డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో వారంతా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. ఆదివాసీ సంఘాలన్నీ కలిసి విక్రమ్ రావును గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే ఎప్పుడూ కార్మికులకు అందుబాటులో ఉంటానని అభ్యర్థి విక్రమ్ రావు అన్నారు.
కార్మికుల సమస్యల కోసం పోరాడుతానని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, పార్టీ సీనియర్ లీడర్లు మత్తమారి సూరిబాబు, కేవీ ప్రతాప్, బండి ప్రభాకర్ యాదవ్, తిరుపతిరెడ్డి, అడ జంగు, ఉత్తూరి సత్తయ్య, నామసాని రాజు, నస్పూరి నర్సింగ్, మునిమంద రమేశ్, దావ రమేశ్ బాబు, కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
తమ కుటుంబం అంతా కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివాసీ కార్మిక సంఘం అభ్యర్థి విక్రమ్ రావుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. తన తండ్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తిగా తమ ఫ్యామిలీ అంతా పని చేస్తున్నదని తెలిపారు.