మావోయిస్టుల ఘాతుకం.. 25 మంది కిడ్నాప్.. నలుగురు హతం

మావోయిస్టుల ఘాతుకం.. 25 మంది కిడ్నాప్.. నలుగురు హతం

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అందులో నలుగురిని అతి దారుణంగా గొంతుకోసి హతమార్చారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పాల్, పూసునార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను మావోయిస్టులు మూడు రోజుల కిందట కిడ్నాప్ చేశారు. అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి, నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్దారించారు. కాళ్లూ చేతులు కట్టేసి, పీకలు తెగ్గోసి అతి దారుణంగా వాళ్లను చంపేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

రెండు గ్రామాలకు చెందిన 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయస్టులు.. అందులో నలుగురిని అంత‌మొందించారు. మరో ఐదుగురిని చితకబాది విడిచిపెట్టారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఇంకా 16 మంది గిరిజనులు మావోయిస్టుల చెరలోనే బందీలుగా ఉన్నారు. తన్నులు తిన్నవాళ్లు ఊళ్లకు చేరుకున్నాక జరిగింది చెప్పడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా బ‌య‌టికి వచ్చింది.