కోడి ధరలు కొండెక్కాయి. పది రోజుల్లోనే చికెన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవ్వగానే చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మార్చి మొదట్లోనే చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో.. చికెన్ కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు నాన్ వెజ్ లవర్స్. పౌల్ట్రీల్లో కోళ్ల పెంపక తగ్గడం.. దాణా ఇతర ఖర్చులు పెరగడంతోనే చికెన్ ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు.
ఉక్రెయిన్ యుద్ధం దెబ్బ..
ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు వంట నూనెల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు ఎప్పటినుంచో ఆకాశంలో విహరిస్తున్నాయి. ఇప్పుడు వీటి లిస్టులో చికెన్ కూడా చేరింది. మూడు వారాల్లో మూడొందలకు చేరింది చికెన్ రేటు. పదిరోజుల్లోనే చికెన్ ధర ఏకంగా 100 రుపాయలు పెరిగింది. మొన్నటి వరకు కిలో 175 ఉన్న చికెన్ ధర.. ప్రస్తుతం 280 అయింది. చికెన్ ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు వ్యాపారులు.
దాణా ఖర్చులు పెరగడంతో..
రాష్ట్రంలో రోజుకు 10 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు జరుగుతాయి. సండే రోజు 15 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు ఉంటాయి. కరోనా భయం తగ్గడంతో... రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా ఎండాకాలంలో చికెన్ అమ్మకాలు తగ్గుతాయి. వేడి ఎక్కువగా ఉండే చికెన్ తినేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో.. చికెన్ రేట్లు.. సమ్మర్ టైంలో తగ్గుతూ ఉంటాయి. కానీ.. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎండలు పెరుగుతుండటంతో.. పౌల్ట్రీల్లో కోళ్లు చనిపోతున్నాయని.. దీనికి తోడు.. దాణా ఖర్చులు పెరిగి.. చికెన్ ధరలు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. గతేడాదితో పోలిస్తే ఈసారి వేసవి మొత్తం చికెన్ ధరలు భారీగా పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. రాబోయే రోజుల్లో.. ఎండలు పెరిగేకొద్దీ చికెన్ కిలో 350 రుపాయల నుంచి 400 రుపాయలు వరకు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దాణా ఖర్చు రెట్టింపు అయ్యి రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు పెరుగుతుండటంతో.. వ్యాపారం తగ్గుముఖం పడుతోందంటున్నారు.
చేపల వైపు జనం మొగ్గు..
పెరుగుతున్న ధరలతో మాంసం కూరకు మధ్యతరగతి కుటుంబాలు దూరమవుతున్నాయి. ఒక్కసారిగా చికెన్ ధర డబుల్ కావడంతో కొనలేకపోతున్నామంటున్నారు జనం. ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయని చెప్తున్నారు. మటన్ కు తోడుగా చికెన్ ధరలు పెరుగుతున్నాయని.. దీంతో చికెన్ కు బదులు చేపలు కొనడం బెటర్ అంటున్నారు.
రాష్ట్రంలో 10వేలకు పైగా బాయిలర్ ఫౌల్ట్రీ ఫాంలున్నాయి. రోజుకు కోటీ 50లక్షలకు పైగా కోళ్ల ప్రొడక్షన్ ఉంటుంది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడమూ ధరల పెరుగుదలకు కారణమంటున్నారు వ్యాపారులు.
మరిన్ని వార్తల కోసం...