హైదరాబాద్, వెలుగు: గ్రూప్స్ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్ బెయిల్ను రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివరామ్ తమ విచారణకు సహకరించడం లేదని, బెయిల్ రద్దు చేసి కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసుల పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని శివరామ్ తరుఫు లాయర్లకు ఎమ్ఎస్జే కోర్టు నోటీసులు జారీ చేసింది.
చిక్కడపల్లి అశోక్ నగర్లోని బృందావన్ విమెన్స్ హాస్టల్లో గత నెల 13న ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివరామ్ అదే నెల 19న నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో లొంగిపోయాడు. కోర్టు సరెండర్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి, 20న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే, ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ కారణమని పోలీసులు సరైన ఆధారాలు అందించకపోవడంతో జడ్జి అతనికి బెయిల్ మంజూరు చేశారు.