థాయ్‌లాండ్‌ లో గ్యాంబ్లింగ్ నిషేధం అని తెలియదు : చీకోటి ప్రవీణ్

థాయ్‌లాండ్‌ లో గ్యాంబ్లింగ్ నిషేధం అని తెలియదు : చీకోటి ప్రవీణ్

థాయ్‌లాండ్‌ లో జరిగిన అరెస్ట్ పై  క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ స్పందించాడు.  నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్‌ కు వెళ్లినట్లుగా తెలిపాడు.  దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా చీకోటి తెలిపాడు.  టోర్నమెంట్ కు సంబంధించిన లేఖలు కూడా తనకు పంపారని వివరించాడు.

 జరిగిన టోర్నమెంట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని చీకోటి వెల్లడించాడు.  తాను ఆర్గనైజేర్ కాదని, తన పేరు కూడా ఎక్కడా లేదని తెలిపాడు.   థాయ్‌లాండ్‌  లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చీకోటి చెప్పాడు.  తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని అన్నాడు. ఈ గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని తేలడంతో తాను చట్టపరంగా బయటకు వచ్చానని అన్నాడు.  

చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్‌  కోర్టు  షరతులతో కూడిన  బెయిల్  మంజూరు చేసింది.  ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన   83 మంది భారతీయులకు కూడా  థాయ్‌లాండ్‌  కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ. 4500 బాట్స్  జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది.  జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు  కూడా ఇచ్చేశారు.  దీంతో చీకోటి ప్రవీణ్ తో పాటుగా 83 మంది  నేడు ఇండియాకు రానున్నారు.  

ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన  91 మంది జూదం ఆడుతుండగా మే 1 సోమవారం తెల్లవారుజామున చౌనబురి ప్రావిన్స్‌ పోలీసులు దాడిచేశారు. 83 మంది భారతీయులతో పాటు 91 మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కాగా మనీలాండరింగ్  కేసులో ఈడీ ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసింది.