
హైదరాబాద్, వెలుగు: క్యాసినో, మనీలాండరింగ్ కేసులో ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేల పేర్లను చెప్పాలంటూ కొందరు తనను ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఈ కేసులో నిందితుడు చీకోటి ప్రవీణ్ వెల్లడించారు. తనను చంపేందుకు హిట్మ్యాన్ యాప్లో సుపారీ ఇచ్చామని చెప్తున్నారని, తనకు ప్రాణహాని ఉందన్నారు. నేపాల్లో జరిగిన క్యాసినోకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చారని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ముసుగులో బెదిరింపులు వస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయన్నారు. విదేశీ కోడ్తో ఉన్న నంబర్తో కాల్స్ చేస్తున్నారని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని సీపీకి లెటర్ కూడా రాశానని, హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశానన్నారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. విదేశాల్లో జూదం లీగల్ అని, తాను క్యాసినోను లీగల్గానే నిర్వహిస్తున్నానని ప్రవీణ్ చెప్పారు. క్యాసినో ఆడేందుకు వచ్చే వారి పొలిటికల్ బ్యాగ్రౌండ్ చూడాల్సిన అవసరం తనకు లేదన్నారు. క్యాసినో కేసు నమోదైన తర్వాత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. క్యాసినో బిజినెస్ కంటే ముందు తాను సాధారణ వ్యక్తినని వెల్లడించారు. మహాభారతంలో పాండవులు కూడా జూదం ఆడారని, జూదం ఆడితే తప్పు అని ఎక్కడా లేదన్నారు.