పంట పండింది : తాలు మిర్చినే క్వింటా రూ.15 వేలు.. నెంబర్ వన్ రకం 22 వేలు

పంట పండింది : తాలు మిర్చినే క్వింటా రూ.15 వేలు.. నెంబర్ వన్ రకం 22 వేలు

ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తుండడమే దీనికి కారణమని అధికారులు చెప్తున్నారు. మొదటి కోత మిర్చి వ్యవసాయ మార్కెట్లకు రావడం మొదలైంది. వరంగల్, ఖమ్మం, మలక్​పేట్​ మార్కెట్​కు వచ్చే మిర్చి ధర మాత్రం భారీగానే పలుకుతున్నది. వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్ రూ.24 వేల నుంచి రూ.28 వేల వరకు అమ్ముడుపోయింది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌కు 127 క్వింటాళ్ల వండర్ హాట్ రకం మిర్చి వచ్చింది.

తాలు మిర్చి రూ.15వేలు పైనే.. 

తాలు రకం మిర్చికి కూడా డిమాండ్ బాగానే ఉంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తాలు మిర్చి క్వింటాల్‌‌‌‌‌‌‌‌ అత్యధికంగా రూ.9వేల నుంచి రూ.15,500 వరకు ధర పలికింది. డిసెంబర్ 28న ఖమ్మం మార్కెట్​లో తాలు రకం మిర్చికి గరిష్టంగా రూ.15,500 ధర పలికింది. ఈయేడు ఇదే అత్యధికం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి.

నంబర్ వన్ రకం గరిష్టంగా రూ.22వేలు

శుక్రవారం మలక్‌‌‌‌‌‌‌‌పేట్ లోని మహబూబ్‌‌‌‌‌‌‌‌ మాన్షన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ రకం మిర్చి 923 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ గరిష్టంగా రూ.22వేలు, కనిష్టంగా రూ.14వేలు, మోడల్‌‌‌‌‌‌‌‌ రూ.15వేల చొప్పున ధర పలికింది. శనివారం ఇదే మార్కెట్‌‌‌‌‌‌‌‌కు నంబర్ వన్ రకం మిర్చి 590 క్వింటాళ్లు రాగా.. అదే ధర నమోదైంది. సోమవారం మాత్రం కేవలం 85 క్వింటాళ్లు రాగా, రూ.18వేలు పలికింది. నంబర్‌‌‌‌‌‌‌‌ 2 రకం శుక్రవారం 967 క్వింటాళ్లు, శనివారం 886  క్వింటాళ్లు మార్కెట్​కు రాగా, గరిష్టంగా రూ.13వేల ధర పలికింది. తేజ రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం 1,710 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ రూ.29వేలు, వరంగల్‌‌‌‌‌‌‌‌లో రూ.22,500 ధర పలికింది.