- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మల్కాజిగిరి, వెలుగు: హెయిర్ కటింగ్కోసం సెలూన్కు వెళ్లిన వృద్ధుడి మెడలో బంగారాన్ని కొట్టేసిన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జగదీశ్వర్రావు తెలిపిన వివరాలు ప్రకారం.. పటేల్ నగర్లో ఉండే తమ్మునూరి నర్సింగ్ రావు(32) స్థానికంగా ఉన్న రాఘవేంద్ర సెలూన్ లో బార్బర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న వెంకటేశ్వర నగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఆరవెల్లి సిద్ధయ్యగౌడ్(87) హెయిర్ కటింగ్ కోసం రాఘవేంద్ర సెలూన్కు వెళ్లాడు. కటింగ్ చేస్తూ వృద్ధుడిని మాటల్లో పెట్టిన నర్సింగ్ రావు అతడి మెడలోని 3 తులాల బంగారు చైన్ను కొట్టేశాడు.
కటింగ్ అయిపోయిన తర్వాత సిద్ధయ్య బయటికి వచ్చాడు. మెడలో చైన్ కనిపించకపోవడంతో మళ్లీ సెలూన్ లోకి వెళ్లి అడగగా.. తాను చూడలేదని నర్సింగ్ సమాధానం ఇచ్చాడు. నర్సింగ్ రావుపై అనుమానంతో సిద్ధయ్య పోలీసులకు కంప్లయింట్ చేశాడు. బార్బర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నర్సింగ్ రావు దగ్గరి నుంచి 3 తులాల గోల్డ్ చైన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు గురువారం అతడిని రిమాండ్కు తరలించారు.