
సింగపూర్: తైవాన్ విషయంలో అమెరికాను చైనా తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్ సదస్సులో చైనాను ఆసియా, -పసిఫిక్ ప్రాంతంలో ముప్పుగా అభివర్ణించడాన్ని తప్పు పడుతూ.. నిప్పుతో ఆడుకోవద్దు అంటూతీవ్రంగా హెచ్చరించింది. హెగ్సెత్.. చైనా, తైవాన్పై సైనిక దాడికి సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ అంశంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. తైవాన్ను తమ భూభాగంలో భాగంగా భావిస్తుందని, అవసరమైతే బలవంతంగా తిరిగి ఏకం చేస్తామని స్పష్టం చేసింది.
ఈ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, తైవాన్ను ఒక దేశంగా పరిగణించడం అజ్ఞానం, అహంకారం అని పేర్కొంది. హెగ్సెత్ వ్యాఖ్యలను నీచమైనవి అని విమర్శించింది. పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు.
భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్ పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి యూఎస్ విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు. తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందని.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయబోమని.. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని హెగ్సెత్ సూచించారు.