ఇండియన్ మార్కెట్లో చైనా మొబైల్స్ హవా

ఇండియన్ మార్కెట్లో చైనా మొబైల్స్ హవా

మార్కెట్లో  ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ హవా నడుస్తోంది. దేశీయ మార్కెట్లో  విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడే ఒక్క దేశీయ కంపెనీ కూడా కనబడటం లేదు. ఐదేళ్ల క్రితం మొబైల్ మార్కెట్ ని ముంచెత్తిన ఇండియన్ కంపెనీలు.. ఇప్పుడు స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లాయి. చైనా స్మార్ట్  ఫోన్  బ్రాండ్స్ మన మార్కెట్ లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. 2014 లో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దేశీయ మొబైల్స్ వాటా 43శాతం ఉండేది. కానీ ప్రస్తుతం ఇది 7శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ లో అమ్ముడవుతున్న ప్రతీ పది స్మార్ట్ ఫోన్స్ లో 6 చైనా బ్రాండ్ వే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ పై చైనా ఆధిపత్యం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పక్కా వ్యూహంతో చైనా కంపెనీలు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని ఏలుతున్నాయి. ముందుగా ఆన్ లైన్ తో మొబైల్స్ ని అమ్మిన చైనీస్ కంపెనీలు ఆ తర్వాత ఔట్ లెట్లతో సేల్స్ మొదలుపెట్టాయి.

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించడం చైనా బ్రాండ్లకు కలిసొచ్చింది. ఇండియన్ కస్టమర్ మొబైల్ కొనేటప్పుడు అది ఏ దేశానికి చెందిన ఫోన్, ఏ బ్రాండ్ అనేది కాకుండా తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో లేవో చూస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ నిర్వహించడం..ఆఫర్స్ పెట్టడం..ఏదైనా కొత్త ఫీచర్ తీసుకొచ్చి దాన్ని మార్కెటింగ్ చేసి సేల్స్ పెంచుకుంటున్నాయి.చైనా బ్రాండ్లు ఆన్ లైన్ మార్గంలో దేశీ మార్కెట్లో స్థానం సంపాదించుకున్న తర్వాత..ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ ఇండియన్ మార్కెట్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. షియోమి, వీవో, ఒప్పో, వన్ ప్లస్, హానర్ లాంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్స్ ప్రవేశపెడుతూ దూసుకెళ్తున్నాయి.

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో చైనీస్ మొబైల్స్ మార్కెట్ షేర్ 80 శాతానికి పైగా ఉంది. ఏడు వేల నుంచి 18 వేల వరకు రేట్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా చైనీస్ మొబైల్స్ హవా నడుస్తోంది. 12 వేలకే 4జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరా, 4 వేల MAH బ్యాటరీ లాంటి ఫీచర్లతో చైనీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో మాత్రం అమెరికన్ కంపెనీ యాపిల్, కొరియన్ కంపెనీ శాంసంగ్ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ప్రీమియం సెగ్మెంట్లో కూడా చైనీస్ కంపెనీ వన్ ప్లస్ బెస్ట్ ఫీచర్లతో గట్టి పోటీనిస్తోంది. తైవాన్ కంపెనీ HTC, అమెరికాకి చెందిన మోటోరోలా ప్రజెంట్ మార్కెట్లో కనబడకుండా పోయాయి.

గతంలో కార్బన్, మైక్రోమాక్స్, ఇంటెక్స్ , లావా, సెల్కాన్ లాంటి దేశీయ కంపెనీలు మన మార్కెట్లో హవా చూపించాయి. ఎప్పుడైతే చైనా ఫోన్లు బెస్ట్ ఫీచర్స్ తో ఎంటరయ్యాయో అప్పటి నుంచి వాటి పోటీని తట్టుకోలేక ఇండియన్ మొబైల్ కంపెనీలు డీలా పడ్డాయి. 4జీ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటరయ్యే టైమ్ ని క్యాచ్ చేసుకున్నాయి చైనీస్ కంపెనీస్. అందుబాటు ధరలో 4జీ మొబైల్స్ ని బెస్ట్ ఫీచర్లతో చైనీస్ కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇదే టైంలో 4జీ మొబైల్స్ ని తక్కువ ధరలో  లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురావడంలో వెనకబడ్డాయి ఇండియన్ కంపెనీలు.  చైనీస్ ఫోన్లని ఎక్కువగా కొంటున్న భారతీయులు..వాటిని జాగ్రత్తగా వాడాలంటున్నారు నిపుణులు. ఫోన్లు హీటెక్కడం, హై రేడియేషన్ లాంటి సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.