
బీజింగ్: చైనాలో మొదలైన కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతోంది. రోజురోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కానీ, చైనాలో మాత్రం గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసు ఒకే ఒక్కటి నమోదైందని ఆ దేశ హెల్త్ కమిషన్ ప్రకటించింది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,633 ఉండగా ఇప్పటివరకు 82,875 కేసులు ఫైల్ అయ్యాయని చెప్పింది. ఇందులో 77,685 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది. వైరస్ కు కేపిటల్ సిటీ అయిన వూహాన్ తో పాటు, హుబీ ప్రావిన్స్లో ఏప్రిల్ 4 నుండి వరుసగా 28 రోజులు ఒక్కటి కూడా కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు కాలేదని శనివారం తెలిపింది. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితులను కూడా సడలించామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 33 లక్షల 40 వేల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 2 లక్షల 39 వేలకు పైగా జనం చనిపోయారు.