బీజింగ్: చైనీయులకు పోర్క్ (పంది మాంసం) కష్టాలొచ్చాయి. రోజువారి డైట్లో పోర్క్ లేనిదే ముద్ద దిగని చైనీయులు మాంసం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు ఆకాశాన్ని అంటుకోవడంతో వారానికి ఒకసారి మాత్రమే మాంసం తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికన్ స్వైన్ రావడం, వాతావరణ పరిస్థితుల వల్ల ఫామ్స్ను మూసేయటంతో పోర్క్కు కొరత ఏర్పడిందని, అందుకే రేట్లు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు చెప్పారు. పోర్క్ రేటు ఒక్క ఆగస్టులోనే దాదాపు 46.7 శాతం పెరిగింది. ప్రపంచంలోని సగం పందులను చైనాలోనే పెంచుతారు. గత ఏడాది వచ్చిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల చాలా పందులు చనిపోయాయి. దీంతో పందుల పెంపకాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు చెప్పారు. పిగ్లెట్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయని, దాని వల్ల మరో ఆరు నెలలు ఈ ధరలు ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్పారు.