- సీఎం సొంతూరులో సందడి
- ‘ఇంటికి రూ.10 లక్షల’పై ఆశ
- వాపస్ వస్తున్న వలస కుటుంబాలు
- పలు స్కీమ్ లకు అప్లికేషన్ల వెల్లువ
- ఇంటింటికీ తిరిగి వివరాలు తీసుకున్న అధికారులు
- రోజూ ఊరు తిరిగిపోతున్న తహసీల్దారు
సిద్దిపేట : ఇతడి పేరు లింగరాజు. సిద్దిపేట జిల్లా చింతమడక. పదేళ్ల కిందట ఊరొదిలి బతుకు దెరువుకు కుటుంబంతోసహా సిద్దిపేట వెళ్లాడు. చింతమడకలో ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా చూస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల హామీ ఇవ్వడంతో లింగరాజు తిరిగి సొంతూరు వచ్చేశాడు. తనకు ఇల్లు, పౌల్ట్రీఫామ్ మంజూరు చేయించాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు.
..ఒక్క లింగరాజు కుటుంబమే కాదు. ఉపాధి కోసం ఊరు దాటిన దాదాపు 70 కుటుంబాలు తిరిగి చింతమడక వచ్చేశాయి. ఇంటింటి సమగ్ర సర్వే చేస్తున్నారని తెలియడంతో ఆగమేఘాలపై ఇంటికి చేరుకున్నాయి. తాము చింతమడక వాసులమేనని సర్పంచ్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కో సాయం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, పౌల్ట్రీ షెడ్లు, ట్రాక్టర్లు, డ్రిప్ స్పింక్లర్లు, కిరాణా షాపు, రైస్ డిపో, జేసీబీ.. ఇలా ఒక్కోదానికి అప్లికేషన్ పెట్టుకున్నారు.
ఇంటింటికీ తిరిగిన ఆఫీసర్లు
చింతమడకలో సీఎం పర్యటిస్తారని తెలియడంతో 50 మంది జిల్లా స్థాయి ఆఫీసర్లు, 300 మంది ఉద్యోగులు గ్రామంలోని పది వార్డుల్లో ఇంటింటి సర్వే చేశారు. చింతమడక మదిర గ్రామం అంకంపేటలోనూ సర్వే సాగింది. ఎవరు ఏ పనిచేస్తున్నారో.. అందుకు తగిన పథకంలో అబ్ధి చేకూర్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు పౌల్ట్రీ, డ్రిప్ స్పింక్లర్లు, ట్రాక్టర్లు అందించే ఆలోచన చేస్తున్నారు. రెవెన్యూకు సంబంధించి దాదాపు 210 సమస్యలు అధికారుల దృష్టికి రాగా ఇప్పటికే 150 వరకు పరిష్కరించారు. రెండు రోజుల్లో మిగతా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం సభలో చిన్న సమస్యలేవీ ప్రజల నుంచి ప్రస్తావనకు రాకుండా చూసుకుంటున్నారు. ఇక స్థానిక తహసీల్దారు రోజూ ఊరు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు.
పదేళ్ల క్రితమే 70కిపైగా ఫ్యామిలీలు వలస
గ్రామంలో ఉపాధి లేకపోవడంతో పదేళ్ల క్రితమే 70కిపైగా ఫ్యామిలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. 16 రజక కుటుంబాలు కోరుట్ల, మెట్పల్లికి వెళ్లి కుల వృత్తిలో కొనసాగుతున్నాయి. 13 వడ్రంగి కులస్తులు సిరిసిల్ల, ఆర్మూర్, సిద్దిపేటకు, 15 ముదిరాజ్ కుటుంబాల్లో పది సిద్దిపేటకు, మిగిలిన ఐదు కుటుంబాలు హైదరాబాద్కు వెళ్లాయి. మూడు గౌడ కుటుంబాలు సిద్దిపేటలో ఉంటున్నాయి. ఎస్సీ , బీసీ కుటుంబాలు డైలీ కూలీ పనికోసం సిద్దిపేట, హైదరాబాద్కు వెళ్లాయి. ఇప్పుడు వీరంతా గ్రామం చేరుకున్నారు.
యూత్కు ఏమిద్దాం?
గ్రామంలో 18 నుంచి 30 ఏళ్లలోపు 200 మంది వరకు యూత్ ఉన్నట్టు గుర్తించారు. వీరి విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పని వంటి వివరాలు సేకరించారు. వీరికి ఎలాంటి ఉపాధి కల్పించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న యూత్కు అద్దె వెహికిల్స్, ఆటోలు అందించేందుకు కసరత్తు చేస్తుండగా రవాణా శాఖ లైసెన్స్ల జారీకి శిబిరం ఏర్పాటు చేయనుంది.
స్పీడ్గా అభివృద్ధి పనులు
గ్రామంలో రోడ్ల విస్తరణ, రిపేర్లు, సైడు కాల్వల నిర్మాణం, స్కూల్ పనులు జోరందుకున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లకు కరెంట్ మీటర్లు ఫిట్ చేస్తున్నారు. అదనంగా 50 కరెంటు స్తంభాలు వేసి ట్రాన్స్ ఫార్మర్లు బిగిస్తున్నారు. సీఎం సభకు 3,200 మంది కూర్చునేలా ప్రాంగణం, రెయిన్ ప్రూఫ్ వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నాం
సీఎం రాకకోసం గ్రామస్తులమంతా ఎదురు చూస్తున్నాం. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏ రంగంలో ఉన్న వారికి ఆ రంగంలో ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామా భివృద్ధికి ఇప్పటికే నిధులు రావడంతో పనులు చేస్తున్నాం. వలస వెళ్లి వచ్చిన వారికీ సాయం అందేలా చూస్తున్నాం. – హంసకేతన్ రెడ్డి, సర్పంచ్, చింతమడక
పౌల్ట్రీ ఫామ్ కోసం అడిగిన
కొద్దిగా వ్యవసాయం ఉంది. దానికి తోడుగా పౌల్ట్రీ ఫామ్ కావాలని దరఖాస్తు చేసుకున్నాం. డబుల్ బెడ్ రూం ఇల్లు కావాలని అడిగిన. – చెప్యాల రాజ ఎల్లయ్య, చింతమడక