
న్యూఢిల్లీ: భారత సెమీకండక్టర్ మార్కెట్ 2025లో 54.3 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, 2030 నాటికి ఇది 103.5 బిలియన్ డాలర్ల (రూ.9 లక్షల కోట్ల) కి చేరనుందని హెచ్ఆర్ సొల్యూషన్లు అందించే క్వస్ కార్ప్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఇది 13.8శాతం వార్షిక వృద్ధి రేటుతో (సీఏజీఆర్) గ్లోబల్ యావరేజ్ను మించుతుందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇండస్ట్రియల్ సిస్టమ్స్లో చిప్ల అవసరం ఎక్కువగా ఉంది. ఈవీలు, 5జీ, డేటా సెంటర్ సెక్టార్లలో పెరుగుతున్న డిమాండ్తో అడ్వాన్స్డ్ చిప్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. 2030 నాటికి హైపర్స్కేల్ డేటా సామర్థ్యం 75శాతం పెరుగుతుంది. కొత్త వాహనాల్లో ఈవీల వాటా దాదాపు 33 శాతానికి చేరుకుంటుంది. దీంతో చిప్ల అవసరం ఎక్కువవుతుంది.
భారత సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) ద్వారా కేంద్రం రూ.1.6 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్లకు ఆమోదం తెలిపింది. 29 వేల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా. ఐఎస్ఎం 2.0 ద్వారా మరో రూ.88 వేల కోట్లకి పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మైక్రాన్ ఏటీఎంపీ ప్లాంట్ (గుజరాత్), తమిళనాడు, కేరళ, గుజరాత్లో రాష్ట్ర ప్రోత్సాహాలతో టైర్-2 క్లస్టర్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. కొత్త చిప్ ప్రోగ్రామ్లలో 50 శాతానికి పైగా ఏఐ యాక్సిలరేటర్లు వాడుతున్నారు. వెరిఫికేషన్ టీమ్లలో 33శాతం మెషీన్ లెర్నింగ్ను వాడుతున్నాయి.
చిప్ ప్రొఫెషనల్స్ ఎక్కువే
ప్రస్తుతం ఇండియాలో 2.5 లక్షల ఏఐ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2024–25లో 43 వేల కొత్త పోస్టింగ్లు క్రియేట్ అయ్యాయి. 2030 నాటికి ఏఐ ప్రొఫెషనల్స్ సంఖ్య 4 లక్షలకు చేరే అవకాశం ఉంది. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద టాలెంట్ హబ్గా నిలవనుంది. డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈడీఏ టూల్స్, ఏటీఎంపీ తయారీ వంటి అన్ని రంగాల్లో నైపుణ్యం పెరుగుతోంది.