
- ఇందులో మ్యూచువల్ ఫండ్స్, సిప్ల ద్వారా వచ్చే ఫండ్స్ వాటానే ఎక్కువ
- జీఎస్టీ తగ్గింపు, ఆర్బీఐ రేట్ల కోతతో వచ్చే ఏడాది మార్కెట్ ర్యాలీ: జెఫరీస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత షేర్ మార్కెట్లోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50–70 బిలియన్ డాలర్ల (రూ.4.4 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల) కొత్త పెట్టుబడులు వస్తాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ల ద్వారా దేశీయ పెట్టుబడులు ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయని పేర్కొంది. 2025ని “హెల్దీ కన్సాలిడేషన్” సంవత్సరంగా పేర్కొంది.
దేశీయ పెట్టుబడుల మద్ధతుతో విదేశీ పెట్టుబడులు కూడా ఈక్విటీల్లోకి వస్తాయని జెఫరీస్ తెలిపింది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం, వచ్చే ఏడాది కొత్త మార్కెట్ ర్యాలీకి అవకాశం ఉంది. జీఎస్టీ తగ్గించడంతో వినియోగం, లిక్విడిటీ రెండూ పెరగనున్నాయి. ఆర్థిక వృద్ధి పుంజుకోనుంది. ఈ అంశాలు 2026లో మార్కెట్ను నడిపిస్తాయి.
వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో ఆర్బీఐ కూడా ఈ ఏడాది చివరికి వడ్డీ తగ్గించే అవకాశం ఉందని జెఫరీస్ అంచనా వేస్తోంది. జీఎస్టీ తగ్గింపు, ఆర్బీఐ రేట్ల తగ్గింపు, కార్పొరేట్ లాభాలు వంటి అంశాలు మార్కెట్ ర్యాలీకి మద్ధతుగా ఉంటాయని అంచనావేసింది. ‘‘స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్స్ కంటే బలమైన లాభాల వృద్ధి చూపుతున్నాయి.
అందుకే ఈ విభాగంలో పెట్టుబడి కొనసాగించొచ్చు” అని సలహా ఇచ్చింది. దేశీయ డిమాండ్, కార్పొరేట్ లాభదాయకత, పాలసీ మద్దతు వంటివి భారత్ను ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్గా నిలుపుతున్నాయి.