మెదక్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్..లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు

మెదక్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్..లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
  • క్రిస్మస్ సెలబ్రేషన్స్​కు..ముస్తాబైన మెదక్ చర్చ్​
  • పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
  •     అదనపు బస్సులను నడుపుతున్న ఆర్టీసీ
  •     పటిష్ట పోలీస్​ బందోబస్తు

మెదక్, టౌన్, వెలుగు : యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న వ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  ఇందులో భాగంగా ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ చర్చ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్​కు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్థానిక పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేశారు. చర్చ్ ప్రాకారాలకు రంగులు వేశారు. ఎత్తైన చర్చ్ టవర్, లోపలి మెయిన్ హాల్​ను స్టార్స్,  బెలూన్లు, గంటలు, గ్రీటింగ్ కార్డులు, మెరుపు కాగితాలతో కలర్ ఫుల్​గా డెకరేట్ చేశారు. అలాగే యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, ఎత్తైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు.

13 జిల్లాల నుంచి..

మెదక్ చర్చిలో ఎంతో గ్రాండ్​గా జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్​ను చూసేందుకు చర్చ్ ఆప్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దాదాపు లక్ష మంది  భక్తులు తరలివస్తారు. ఈ మేరకు పాస్టరేట్ కమిటీతో పాటు, మున్సిపల్, పోలీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి, టాయిలెట్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సోమవారం వేకువ జామున 4:30 గంటలకే ఫస్ట్ సర్వీస్​తో  క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు భక్తులకు దేవుడి వ్యాక్యాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత ఉదయం 9:30  గంటలకు సెకండ్ సర్వీస్ అయ్యాక భక్తులందరిని చర్చి లోపలికి అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం వివిధ రూట్ల నుంచి అదనపు బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

పటిష్ట బందోబస్తు

 క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ మహేందర్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కంట్రోల్ రూమ్ తోపాటు, మొబైల్ టీమ్​లను, మఫ్టీ పోలీసులను నియమించామని పేర్కొన్నారు.  చర్చ్ మెయిన్ గేట్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశామన్నారు.  మూడు రోజులపాటు జరిగే వేడుకలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

కలర్​ఫుల్​​ లైటింగ్​లో జిగేల్ మంటోంది. ఈసారి వేడుకలకు లక్షమందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ చర్చి నిర్మించి 99 ఏండ్లు పూర్తయి, 100 వ వసంతంలోకి అడుగుపెడ్తుండడంతో స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. 1914 లో చేపట్టిన చర్చి నిర్మాణం 1924లో పూర్తయింది. చర్చిలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే ఫస్ట్ సర్వీస్​తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. 

- వెలుగు, మెదక్​