హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రీస్ అసోసియేషన్, సీఐఐ తెలంగాణ హైదరాబాద్లో శుక్రవారం సీఎఫ్ఓ కాన్క్లేవ్ నిర్వహించాయి. ఆర్థిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు , ఏఐ విప్లవం నేపథ్యంలో ఫైనాన్స్ లీడర్ల పాత్ర ఎంతగానో మారుతోందని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు. అధికారులు, కార్పొరేట్ సంస్థల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు , ఆర్థిక నిపుణులు సదస్సుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, యంత్రాలు లెక్కలను మాత్రమే చేయగలవని, అసలైన ఆలోచనలు చేయడం మాత్రం మనుషుల పనేనని స్పష్టం చేశారు. తెలంగాణ గతంలో కేవలం రూ.60 వేల కోట్ల బడ్జెట్ నుంచి నేడు రూ.2.40 లక్షల కోట్ల బడ్జెట్కు ఎదిగిందని గుర్తుచేశారు.
రాష్ట్రం నిర్దేశించుకున్న మూడేళ్లలో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించడంలో సీఎఫ్ఓల పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. కేవలం గత కాలపు లెక్కలను బేరీజు వేసుకుంటూ కూర్చోకుండా, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ముందే పసిగట్టి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలని ఫైనాన్స్ లీడర్లకు ఆయన పిలుపునిచ్చారు.
