
- దేశమంతటా నిరసనలు
- ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
- పలు వర్సిటీల్లో పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ: ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ స్టూడెంట్స్కు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. సిటిజన్ షిప్చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన జామియా స్టూడెంట్స్పై పోలీసుల లాఠీచార్జ్ని వ్యతిరేకించారు. ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, ముంబై, బెంగళూరు, చెన్నై, కోలకతా లాంటి సిటీల్లోని స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.జామియా క్యాంపస్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని ప్రశ్నించారు. లైబ్రరీని ధ్వంసం చేయడం పట్ల పర్మిషన్ లేకుండా క్యాంపస్లోపలికి వెళ్లడాన్ని తప్పుపట్టారు. సోమవారంనాటి టెన్షన్ పరిస్థితులతో చాలా యూనివర్సిటీల్లో పోలీసుల్ని పెద్ద సంఖ్యలో దింపారు. ఢిల్లీలోని పలు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ను బాయ్కాట్ చేశారు. నార్త్ క్యాంపస్ ఆర్ట్ ఫ్యాకల్టీ దగ్గర జామియా స్టూడెంట్స్కు సపోర్ట్గా నిరసన తెలిపారు.
హైదరాబాద్
ఢిల్లీ పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ సోమవారం గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని బీజేపీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ పోలీసులు క్షమాపణ చెప్పాలని స్టూడెంట్స్ లీడర్స్ డిమాండ్ చేశారు.
లక్నో
నాడ్వా కాలేజీ స్టూడెంట్స్ ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “ స్టూడెంట్స్ క్యాంపస్ లోపలి నుంచి మాపై రాళ్లు విసిరారు. నిరసనకారుల్ని అడ్డుకున్నాం. క్యాంపస్ నుంచి బయటకు రావడానికి ఎవర్నీ అనుమతించలేదు”అని ఉత్తర ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.
ముంబై
సిటిజన్షిప్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) స్టూడెంట్స్ రోడ్లు పైకి వచ్చారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టాఫ్ మెంబర్స్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రధానికి ఐఐఎం బెంగళూరు స్టూడెంట్స్ లెటర్
జామియా, అలీగఢ్ యూనివర్సిటీల్లో పోలీసుల తీరును 100 మంది ఐఐఎం బెంగళూరు స్టూడెంట్స్ ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకొచ్చారు. “సిటిజన్షిప్ సవరణ చట్టనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న స్టూడెంట్స్కు మేం మద్దతు చెబుతున్నాం. పోలీసు చర్యల్ని ఖండిస్తున్నాం. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయొద్దని ఈ ఇష్యూని మీ దృష్టికి తీసుకొస్తున్నాం”అని వాళ్లు ప్రధానికి లెటర్ రాశారు. వ్యక్తిగత హోదాలోనే తాము ఈ లెటర్ రాశామన్నారు.
ఐఐఎం అహ్మాదాబాద్ స్టూడెంట్స్ నిరసన
ఐఐఎం అహ్మాదాబాద్ కు చెందిన సుమారు 50 మంది స్టూడెంట్స్ క్యాంపస్ దగ్గర ఆందోళనచేశారు. కొంతమంది స్టాఫ్ మెంబర్లు కూడా దీనిలో పాల్గొన్నారు. క్లాసికల్ డ్యాన్సర్ మల్లికా సారాభాయ్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
3 ఐఐటీల మద్దతు
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మూడు ఐఐటీ లకు చెందిన కొందరు స్టూడెంట్ యూనియన్స్ కూడా ఆందోళనలకు సపోర్ట్ చేశాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ముంబై… జామియా స్టూడెంట్స్కు సంఘీభావం తెలిపాయి. ఐఐటీ మద్రాస్ స్టూడెంట్స్ కొందరు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
తమిళనాడు
చెన్నైలోని లయోలా కాలేజ్ స్టూడెంట్స్ నిరసనలు తెలిపారు. చెన్నై, మధురై, కోయంబత్తూర్ రైల్వేస్టేషన్ల దగ్గర ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేశారు.కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ , వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( ఐఐఎస్సీ) స్టూడెంట్స్ కూడా ఆందోళనకు దిగారు. చండీగఢ్, పాట్నా , పాండిచ్చేరి, ముంబై యూనివర్సిటీలు కూడా జామియా స్టూడెంట్స్కు సపోర్ట్ తెలిపారు.