- ఆర్బీఐ గవర్నర్కు లెటర్ రాసిన బ్యాంక్ బచావో దేశ్ బచావో మంచ్
- బీఓబీ మొబైల్ యాప్ స్కామ్తో నష్టపోయిన 362 మంది కస్టమర్లు!
- యాప్పై రిస్ట్రిక్షన్లు పెట్టిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) టాప్ మేనేజ్మెంట్ కనుసన్నల్లోనే ‘వరల్డ్ యాప్’ స్కామ్ జరిగిందనే ఆరోపణలు రావడంతో సివిల్ సొసైటీ ప్లాట్ఫామ్స్ స్పందిస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్లను ఆపరేట్ చేస్తున్న బ్యాంకుల్లో కొత్త ఆడిట్ మెకానిజం తీసుకురావాలని, అకౌంట్ హోల్డర్ల ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉండేలా చూడాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు బ్యాంక్ బచావో దేశ్ బచావో మంచ్ లెటర్ రాసింది.
కస్టమర్ల బయోమెట్రిక్ వివరాలను మార్చడం వంటి మాల్ ప్రాక్టీస్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ‘వివిధ బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్లలో రిజిస్ట్రేషన్లు పెంచేందుకు బిజినెస్ కరస్పాండెంట్లు, ఉద్యోగుల ద్వారా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాసెస్లో చాలా మంది కస్టమర్లు తమ డబ్బులు నష్టపోతున్నారు. బ్యాంకు బ్రాంచులు తమ ఉద్యోగులు, కర్స్పాండెంట్లపై అసాధ్యమైన టార్గెట్స్ పెడుతున్నారు. లోన్ల వంటివి ఇప్పించడం, మొబైల్ బ్యాంకింగ్ వంటి యాప్లో కొత్త కస్టమర్లను చేర్చడం, అకౌంట్ ఓపెనింగ్ వంటి వివిధ అంశాల్లో భారీ టార్గెట్స్ పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోసాలు జరుగుతాయని నమ్ముతున్నాం. టార్గెట్స్ చేరుకుంటే చాలు బ్యాంకుల మేనేజ్మెంట్లు మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదు’ అని ఈ సంస్థ లెటర్లో వెల్లడించింది.
బీఓబీ స్కామ్..
రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ బీఓబీలో స్కామ్ జరిగిందని అల్జజీరా కిందటి వారం ఓ రిపోర్ట్ విడుదల చేసింది. బ్యాంక్ 2021 లో లాంచ్ చేసిన బీఓబీ వరల్డ్ యాప్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్లు పెంచేందుకు బ్యాంక్ కరస్పాండెంట్లు, ఉద్యోగులు అనైతిక విధానాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిజిస్ట్రేషన్ టార్గెట్లను చేరుకోవడానికి బ్యాంక్ స్టాఫ్ అకౌంట్ హోల్డర్లకు సంబంధం లేని ఫోన్ నెంబర్లతో బ్యాంక్ అకౌంట్లను లింక్ చేశారని పేర్కొంది. ‘ అకౌంట్ నెంబర్తో మొబైల్ నెంబర్ లింక్ కాని అకౌంట్ల లిస్ట్ను బీఓబీ కరస్పాండెంట్లు, ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత ఈ అకౌంట్లను ర్యాండమ్ నెంబర్లతో లింక్ చేశారు.
అంటే బ్యాంకుల్లో పనిచేసే క్లీనర్లు, సెక్యూరిటీ గార్డ్స్ లేదా తమ రిలేటివ్ నెంబర్లతో లింక్ చేశారు. బ్యాంక్ అకౌంట్ లింక్ జరిగాక సింపుల్గా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి ఈ ర్యాండమ్ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ జరిపేవారు. మేనేజ్మెంట్ ఇచ్చిన టార్గెట్లను ఇలా చేరుకునేవారు’ అని అల్జజీరా రిపోర్ట్ ఆరోపించింది. అంతేకాకుండా ఇలాంటి మాల్ ప్రాక్టీస్లు జరిగాయని బ్యాంక్ మేనేజ్మెంట్ ఇంటర్నల్గా అంగీకరించిందని కూడా తెలిపింది. కొంత మంది బీఓబీ ఏజెంట్లు ఇలాంటి విధానాల్లో అకౌంట్ హోల్డర్ల డబ్బులను కాజేశారని కూడా వివరించింది.
రూ.22 లక్షలు మాయం!
ఈ స్కామ్లో సుమారు 362 మంది కస్టమర్లు రూ.22 లక్షల వరకు నష్టపోయారని అల్జజీరా రిపోర్ట్ పేర్కొంది. ఇందులో ఆరుగురు రూ. 1.10 లక్షల కంటే ఎక్కువ నష్టపోయారు. ది రిపోర్టర్స్ కలెక్టివ్(టీఆర్సీ), అల్జజీరా రిపోర్ట్స్ బయటికొచ్చాక బీఓబీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్కామ్ వెలుగులోకి వచ్చాక ఇలా ర్యాండమ్ అకౌంట్ నెంబర్లతో లింక్ జరిగిందని అనుమానించే 4,22,000 బ్యాంక్ అకౌంట్లను బీఓబీ ఇంటర్నల్గా ఆడిట్ చేసింది. స్కామ్ను కవర్ అప్ చేసేందుకు బీఓబీ టాప్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోందని అల్జజీరా రిపోర్ట్ ఆరోపిస్తోంది.
ఇందుకోసం డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసేలా బ్యాంకు మేనేజర్లు ఉద్యోగులపై ఒత్తిడి పెంచారని వెల్లడించింది.అకౌంట్– ఫోన్ నెంబర్ లింకింగ్ ఫామ్లో అకౌంట్ హోల్డర్ల సిగ్నేచర్ను ఫోర్జరీ చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించింది. కాగా, ఈ ఇష్యూపై బీఓబీ స్పందించింది. తమ బీఓబీ వరల్డ్ యాప్లో 3 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమ బ్యాంక్ అకౌంట్లతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నవారే తమ యాప్లో రిజిస్టర్ చేసుకున్నారని చెప్పింది. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చాక కొత్త కస్టమర్లను బీఓబీ వరల్డ్ యాప్లో యాడ్ చేసుకోవడంపై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది.