న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. శని, ఆది వారాలు కోర్టుకు వారాంతపు సెలవులు కావడంతో శుక్రవారం తన చివరి పనిదినాన్ని అదే నిబద్ధతతో పూర్తిచేశారు. కేవలం ఆరు నెలలు మాత్రమే సీజేఐగా సేవలందించినా.. ఎన్నో కీలకమైన కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
తనదైన విచారణ తీరుతో బ్యూరోక్రాట్స్, పొలిటికల్ లీడర్లు, ఎన్జీఓలు, ఇలా అన్ని రంగాలపై కీలక కామెంట్లు చేశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి బౌద్ధ మతస్థుడిగాను ఆయన నిలిచారు. కాగా.. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కొలీజియం సిఫార్సు చేయగా.. కేంద్ర కేబినెట్ అందుకు ఆమోదం తెలిపింది.
ఆర్కిటెక్ట్ కావాలనుకుని..
జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఆర్కిటెక్ట్ కావాలనుకున్న ఆయన తన తండ్రి రామకృష్ణ సూర్యబాన్ గవాయ్ కోరిక నెరవేర్చడానికి ఆయన న్యాయవాదిగా మారారు. 25 ఏండ్ల వయస్సులో జస్టిస్ గవాయ్ 1985 మార్చి 16న బార్ ఆసోసియేషన్లో చేరారు. బాంబే హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఎలక్టోరల్ బాండ్లు, ఆర్టికల్ 370పై కీలక తీర్పులు
జస్టిస్ గవాయ్ అత్యంత కీలకమైన రాజకీయ కేసుల్లో తన తీర్పులకు ప్రసిద్ది చెందారు. తరచుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషనర్ కు ఉపశమనం కల్పించేలా ఆయన ఉత్తర్వులు ఉంటాయని న్యాయనిపుణులు చెబుతుంటారు. ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడాన్ని సమర్ధించిన మరో రాజ్యాంగ ధర్మాసనంలో (2023 డిసెంబర్లో) కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. అంతే కాకుండా... తెలంగాణ కు సంబంధించిన కంచ గచ్చిబౌలి, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, వంటి ఇతర కీలక కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక కామెంట్లు చేశారు.
రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం కేసు..
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు వివారణలో 2023 జులైలో జస్టిస్ గవాయ్ కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి ఉన్న అనుబందాన్ని వెలడిస్తూ విచారణ నుంచి తప్పుకోవడానికి ముందుకొచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను తప్పించాలని కోరలేదు. చివరకు ఆ శిక్షపై స్టే విధించడంతో రాహుల్ గాంధీ తిరిగి లోక్ సభకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.
చెప్పుతో దాడి.. మరిచిపోయిన అధ్యాయం..
మానవ విలువలు, పర్యావరణం, ప్రకృతి, ఇతర అంశాలపై ఎంతో క్లారిటీ తో ఉండే సీజేఐ బీఆర్ గవాయ్ జీవితంలో ఒక చీకటి రోజు కూడా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 6న సీజేఐ బీఆర్ గవాయ్పై 71 ఏండ్ల అడ్వొకేట్ రాకేష్ కిశోర్ షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనను "మరచిపోయిన అధ్యాయం"గా ఆయన అభివర్ణించారు.
