సీఎం కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ భట్టి విక్రమార్క

సూర్యాపేట : కరోనాను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్‌ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధ‌వారం సూర్యాపేట జిల్లా ఆస్పత్రిని సందర్శించిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభణ అధికంగా ఉందని, జిల్లా ఆస్పత్రిలో క‌రోనా చికిత్సకు మౌలిక వసతులు కూడా లేవ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో కేసీఆర్ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు.

సూర్యాపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి అసలు ఉన్నారా? లేరా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ కు దగ్గర మనిషని చెప్పుకునే జగదీష్ రెడ్డి.. ప్రజలు కరోనా బారిన బడి చనిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరోనా రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులు కరువయ్యారని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఆసుపత్రిలో వైద్యుల కొరత, సిబ్బంది కొరతతో పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భట్టి డిమాండ్ చేశారు.