హైదరాబాద్: కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంగళవారం ఆయన జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నా.. పట్టించుకునే వారే లేరన్నారు. టాస్క్ ఫోర్స్ వేశారు కానీ.. అది ఉత్తదే అన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ సీరియస్ గా పనిచేయడం లేదని..ఓ సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ.. కనిపిస్తున్నారన్నారు. కో ఆర్డినేట్ చేయాల్సిన సీఎస్..మొదటి డోస్ దేవుడెరుగు.. రెండో డోస్ కూడా దొరకడం లేదని.. రెండో డోస్ కూడా ఇవ్వకుండా ఆపడం దారుణం అన్నారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలారని.. ఫార్మా కంపెనీలతో సీఎస్, టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్, మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు కానీ..అసలు ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. ఆ సమావేశ ఉద్దేశం ఏంటీ ప్రజలకు చెప్పనక్కరలేదా అన్నారు.
రెమిడీస్ వేర్ ఇంజక్షన్ దొరక్క బ్లాక్ మార్కెట్ లో కొనుకుంటున్నారని..48గంటల్లో పాత జీవో పని చేయకుండా చేశారన్నారు. సర్కార్ కోమాల్లో ఉన్నట్లు ఉందని.. పాత సినిమాల పాతాళ భైరవిలా.. సీఎం కేసీఆర్ అలా వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారన్నారు. తమిళనాడులో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా వేసి పనిచేస్తున్నారని.. ఆ కమిటీలో ప్రతిపక్షాలు కూడా ఉన్నాయన్నారు. ఒంటెద్దు పోకడతో సర్కార్ పోతుందన్న భట్టి..కరోనా, లాక్ డౌన్ తో.. పబ్లిక్ సతమతమవుతున్నారని తెలిపారు.
వారికీ దైర్యం నింపే పని సీఎం కేసీఆర్ చేయాలని.. కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్ పదవి రాగానే.. వ్యాక్సిన్ బంద్ అయ్యిందన్నారు. మీ వల్ల కాకుంటే.. మా సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. మండలాల్లో, గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెడితే.. హైదరాబాద్ పై ఫోర్స్ తగ్గుతుందని సూచించారు. సీఎస్ కు ఆ పట్టింపు లేదని..తెలివైన వారిని కమిటీలో పెట్టుకోవాలన్నారు.అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని..గవర్నర్ కూడా చొరవ తీసుకోవాలన్నారు. ఆరుకాలం పండించిన పంట నీటి పాలవుతోందని..అకాల వర్షాలు.. అన్న దాతను నట్టేట ముంచుతున్నాయన్నారు. ఆశించిన స్థాయిలో కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడంతో.. నెలల తరబడి రోడ్లపైనే ధాన్యం కుప్పలు ఉంటున్నాయని చెప్పారు.
సోనుసూద్ ను చూసి నేర్చుకోవాలె..
కరోనా కష్ట సమయంలో నటుడు సోనుసూద్ చేస్తున్న సాయంపై మాట్లాడిన భట్టి..సోను సూద్ ను చూసి.. మన హీరోలు, హీరోయిన్లు కూడా కండ్లు తెరవాలి అన్నారు. కరోనా బాధితులను ఆదుకోడానికి టాలీవుట్ హీరో, హీరోయిన్లు.. ముందుకొచ్చి సాయం చేయాలని సూచించారు భట్టి విక్రమార్క.