- మెదక్ జిల్లాలో ఘటన, వ్యక్తి అరెస్ట్
రామాయంపేట, వెలుగు: వన్యప్రాణి సాంబార్ను చంపి, దాని మాంసాన్ని పాళ్లు వేసిన ఘటన ఆదివారం మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుత్బుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... రామాయంపేట మండల దంతేపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అడవి జంతువును చంపి పాళ్లు వేసుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందింది. దీంతో ఆఫీసర్లు గ్రామానికి వెళ్లి అనుమానితుల ఇండ్లను తనిఖీ చేయగా.. చాకలి శ్యామయ్య ఇంట్లో అడవి జంతువు మాంసం దొరికింది.
అడవిలో కుక్కలు తరమడంతో బయటకు వచ్చిన సాంబార్ను శ్యామయ్యతో పాటు మరికొందరు కలిసి చంపి మాంసాన్ని పంచుకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు శ్యామయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అతడికి రాజు, శంకర్, అశోక్, సాయిలు సైతం సహకరించినట్లు తెలిసిందని కుత్బుద్దీన్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
