
- 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా..
- కుంగిన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌస్ పరిశీలన
- అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలో కుంగిన బ్యారేజీలు, పంప్హౌస్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ రానున్నారు. లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరంలో నాణ్యతాలోపాలపై పవర్పాయింట్ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని హేమాహేమీలంతా తరలివస్తుండటం, అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న మేడిగడ్డ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీస్ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదివారం జిల్లా ఆఫీసర్లందరితో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏయే ప్రభుత్వ శాఖల తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆదేశాలు జారీ చేశారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆసక్తి..
సీఎం హోదాలో రేవంత్రెడ్డి తొలిసారి రేపు భూపాలపల్లి జిల్లాలో అడుగుపెట్టనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులతో కలిసి మహదేవపూర్మండలం అంబట్పల్లి దగ్గర గోదావరి నదిపై కుంగిన మేడిగడ్డ బ్యారేజీని, గతంలో నీట మునిగిన కన్నెపల్లి పంప్హౌజ్ ను పరిశీలించనున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ ప్రెసిడెంట్హోదాలో గతేడాది నవంబర్ 2న రాహుల్ గాంధీతో కలిసి రేవంత్రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత డిసెంబర్ 29న ఐదుగురు రాష్ట్ర మంత్రుల బృందం బ్యారేజీని పరిశీలించింది. అదే రోజు ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులుఇక్కడ పవర్ పాయింట్ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారం రోజుల పాటు కాళేశ్వరం రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకొని క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, సర్కారుకు ప్రాథమిక నివేదిక అందజేసింది. కాళేశ్వరం దుస్థితికి సర్కారు పెద్దలు, ఇంజినీర్ల నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ సంస్థ నాసిరకం నిర్మాణాలే కారణమని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవ్వబోయే పవర్పాయింట్ప్రజెంటేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడిగడ్డ వద్ద పవర్పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచే టెంట్లు, కుర్చీలు తెప్పిస్తున్నారు. మొబైల్ టాయిలెట్లు, బాత్రూమ్ల కోసం వెహికిల్స్ సిద్ధం చేస్తున్నారు.
పోలీసుల హై అలర్ట్
సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఐజీ శ్రీనివాస్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే మేడిగడ్డ బ్యారేజీ, కనెపల్లి పంప్హజ్ దగ్గర ఏర్పాట్లు పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీఐపీలు వచ్చే మార్గాల్లోని కల్వర్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు. స్పెషల్ పోలీసులు అటవీ గ్రామాలను జల్లెడ పడుతున్నారు. వెయ్యి మందికి పైగా పోలీసులు భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నారని పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఇంజినీర్లంతా అందుబాటులో ఉండాలి: భూపాలపల్లి కలెక్టర్
సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆదివారం భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా ఆఫీసర్లతో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన జిల్లాస్థాయి ఆఫీసర్లతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి లింక్‒1 పరిధిలో పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈల నుంచి ఎస్ఈల వరకు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో రాబోతున్నందున వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ సహా స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు
సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులను కలుసుకోవడానికి వచ్చే ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు కూడా సర్కారు తరఫున మేడిగడ్డ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి బ్యాక్ వాటర్ వల్ల నష్టపోతున్న రైతులు ఇక్కడికి రానున్నారు. అలాగే భూసేకరణ సమయంలో ఎవరికైనా రైతులకు నష్టం జరిగితే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్ అరగంట సేపు ప్రజలతో మాట్లాడటానికి అవకాశం
ఉన్నట్లు తెలుస్తోంది.