
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రోజైన మంగళవారం ప్రచారం చేయడానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఏక్ నాథ్ షిండే.. ఆదిలాబాద్, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో, దేవేంద్ర ఫడ్నవీస్.. దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు.
హన్మకొండ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సాథ్వీ నిరంజన్, నిజామాబాద్ అర్బన్ లో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, సంగారెడ్డి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి భగవత్ ఖరద్ ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సోమవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.