- రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన
- ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ బిల్డింగ్ పనులకు భూమిపూజ
- 50 రోజుల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం మూడో టూర్
- సభలో సీఎం మాట్లాడే అంశాలపై సర్వత్రా ఆసక్తి
మహబూబ్నగర్, వెలుగు: సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మరోసారి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. గతేడాది డిసెంబరు ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటించి రూ.4,500 కోట్లతో చేపట్టనున్న ‘కొడంగల్’ లిఫ్ట్ స్కీమ్కు భూమిపూజ చేశారు. అదే నెల డిసెంబరు 24న సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని కోస్గి మండలకేంద్రానికి వచ్చారు. కొత్తగా ఎన్నికైన నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని న్యూ ఇయర్ గిఫ్ట్గా మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న జీపీలకు రూ.5 లక్షలు ప్రకటించారు.
తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. రూ.1,284.44 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మహబూబ్నగర్లో ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. త్వరలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరిగే సూచనలు ఉండడంతో.. ఎన్నికల ప్రస్తావన ఆయన ప్రసంగంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రూ.600 కోట్లతో ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ భవనాలు..
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ అనుబంధ క్యాంపస్ను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మేలో మహబూబ్నగర్ జిల్లాకు మంజూరు చేసింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభించింది. సొంత భవనం లేకపోవడంతో నగరంలోని రెడ్డి కన్వన్షన్ హాల్ను తాత్కాలికంగా అద్దెకు తీసుకొని క్లాసులు ప్రారంభించింది. ప్రస్తుతం రెండేళ్లకు సంబంధించి ప్రీ యూనివర్సిటీ కోర్స్(పీయూసీ) మొదటి సంవత్సరం నడుస్తోంది. 208 మంది పిల్లలు ఉండగా.. ఇందులో 148 మంది బాలికలు, 60 మంది బాయ్స్ ఉన్నారు. ఫస్ట్ సెమిస్టర్ కూడా పూర్తయింది.
అయితే ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందు కోసం 44 ఎకరాల భూమి అవసరం ఉంది. ఈక్రమంలో గత ఏడాది మే 3న బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ గోవర్దన్, జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ పాలమూరులో పర్యటించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం దివిటిపల్లి, ఎదిర మధ్యలో జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి, చిట్టబోయిన్పల్లి, పాలమూరు యూనివర్సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నివేదికను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కు అందించగా.. వారు ఈ రిపోర్టును అదే నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ను నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి, -ఎదిర వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉండడంతో పనులు మొదలు పెట్టేందుకు అధికార యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లు అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మూడు విడతల్లో ఈ నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లను శ్యాంక్షన్ చేయగా.. ఈ పనులకు శనివారం సీఎం భూమిపూజ చేస్తారు.
రూ.883 కోట్లతో అండర్ డ్రైనేజీ, శాశ్వత తాగునీరు
కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి పథకం కోసం రూ.883 కోట్లు మంజూరయ్యారు. ఇందులో రూ.603 కోట్లతో సీవర్ లైన్(మురుగు నీటిని నగరం బయటకు తరలించే కాలువ) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను నాలుగు జోన్లుగా నగరాన్ని డివైడ్ చేశారు. ఇందులో మూడు జోన్లు నగరంలో, మరో జోన్ నగరం బయట ఉంది. ఎర్రకుంట, గోల్ మసీద్ ప్రాంతాన్ని ఒక జోన్గా, పెద్ద చెరువు ప్రాంతాన్ని మరో జోన్గా, శ్రీనివాస కాలనీ ఏరియాను ఇంకో జోన్, మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్ ప్రాంతాన్ని ఇంకొక జోన్గా డివైడ్ చేశారు.
ఇందులో మయూరి పార్క్, కొత్త కలెక్టరేట్ జోన్ నగరం బయట ఉంటాయి. మిగతా మూడు జోన్లు నగరం లోపల ఉంటాయి. ఈ నాలుగు జోన్ల పరిధిలోని 60 డివిజన్లలో సీవర్ లైన్ను ఏర్పాటు చేయనున్నారు. రూ.220 కోట్లతో 1.50 కోట్ల లీటర్ల కెపాసిటీ ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మించనున్నారు. ఈ ట్యాంకులను వీరన్నపేట డబుల్ బెడ్రూమ్, హనుమాన్పుర, పాత డీఎంహెచ్వో ఆఫీస్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఏరియా, రామయ్యబౌలి, తిరుమల హిల్స్, మర్లు బైపాస్, ఏనుగొండ, టీచర్స్కాలనీ, మెట్టుగడ్డ, జైనల్లీపూర్ వద్ద నిర్మించనున్నారు. ఈ 15 ట్యాంకులకు నీటిని అందించేందుకు 26 కిలోమీటర్ల మేర ఫీడర్ మెయిన్ పైపులైన్. 210 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ వేయనున్నారు. ఈ లైన్ ద్వారా కొత్తగా 10 వేల కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం సభను సక్సెస్ చేయాలి
మహబూబ్నగర్ పట్టణం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నగరంలో రూ.1,463 కోట్ల పలు అభివృద్ధి పనులకు సీఎం శనివారం శంకుస్థాపనలు చేస్తారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సీఎం సభా స్థలి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఫలాలు అందించేందుకు వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు తరలిరావాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
