పెళ్లిళ్లు చేసుకుంటారు.. విడాకులు తీసుకుంటారు .. ఏపీ సీఎం సెటైర్లు

పెళ్లిళ్లు చేసుకుంటారు.. విడాకులు తీసుకుంటారు .. ఏపీ సీఎం సెటైర్లు

ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ పెళ్లి చేసుకొని.. ఆ తరువాత విడాకులు తీసుకుంటాయని సెటైర్లు వేశారు జగన్. ఎన్నికలప్పుడు చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.  గత పాలనలో ఎస్సీలకు, బీసీలకు అన్యాయం జరిగింది అని  ఆయన ఆరోపించారు.  తాను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారని విమర్శించారు ఏపీ సీఎం . పెద్ద గ్రౌండ్‌లో సభ పెట్టే దమ్ము లేదు.. చిన్న చిన్న సందుల్లో మీటింగ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

దండం పెట్టి వెనక్కు పంపారు

చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదు.. దండం పెట్టి పంపారని ఎద్దేవా చేశారు.  ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదట అంటూ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం జగన్. రాష్ట్రాన్ని గజ దొంగల ముఠా లాగా దోచుకోవాలని అందరూ కలుస్తున్నారని జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు చెబితే బీజేపీకి విడాకులు

 పేదల కోసం నిలబడి ఉన్న తనను ఎవ్వరూ ఏమిచేయలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీకి భయపడే పవన్‌ ఆ పార్టీ పక్కకు చేరాడని.. కానీ, చంద్రబాబు చెబితే బీజేపీకి దత్త పుత్రుడు విడాకులు ఇస్తాడని వ్యాఖ్యానించారు.. ఇలాంటి రాజకీయాలు కాదు.. రాజకీయాల్లో విశ్వసనీయత కావాలన్నారు జగన్..