అమరావతి : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కడప స్టీల్ప్లాంట్ పై సీఎం జగన్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను తెలిపారు.
ఈ సంస్థలతో చర్చలు జరపాలని అధికారులకు ఆదేశాలిచ్చిన సీఎం.. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఈ క్రమంలోనే కడప స్టీల్ ప్లాంట్ కు ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ నిర్మాణం దిశగా మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.