
హైదరాబాద్, వెలుగు: కరోనా సోకకుండా ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకినా చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని.. ఇతర జబ్బులున్న వాళ్లు మాత్రమే అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువైనా తగిన ట్రీట్మెంట్ అందించడానికి సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం సీరియస్ పేషెంట్లకు హాస్పిటళ్లలో ఉంచి.. లక్షణాల్లేనివారికి హోం ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్షించారు.
మీడియా కుట్ర, దుష్ప్రచారం
రాష్ట్రంలో ఎంతమందికైనా ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం సర్కారు హాస్పిటళ్లకు ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, నిపుణులు సమీక్షలో సీఎం కేసీఆర్కు వివరించారు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. ఆ ప్రచారం వెనుక కుట్ర ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. 2,150 మందిని ట్రీట్చేయగలిగే గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం 247 మంది కరోనా పేషెంట్లు మాత్రమే ఉన్నారని.. కానీ కొందరు పనిగట్టుకుని గాంధీ ఆసుపత్రి కోవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు. వాస్తవాలకు, దానికి పొంతన లేదన్నారు.
గాంధీలో వెయ్యి ఆక్సిజన్ బెడ్లు
గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన వెయ్యి బెడ్లు ఉన్నాయని సీఎంకు అధికారులు చెప్పారు. గాంధీలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరం ఇంత వరకు రాలేదన్నారు. పేషెంట్లు ఎక్కువైతే ట్రీట్మెంట్ అందించే ఏర్పాట్లు లేవని దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తి సిద్ధంగా ఉందని.. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్95 మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయని తెలిపారు. సర్కారీ హాస్పిటళ్లలో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్ మొత్తం 3,600 సిద్ధంగా ఉంచామని సీఎంకు వివరించారు. డిశ్చార్జి అయి వెళ్లినవాళ్లు హాస్పిటల్ ట్రీట్మెంట్, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
153 మంది హెల్త్ సిబ్బందికి వైరస్
డాక్టర్లు, హెల్త్ సిబ్బందికి కరోనా సోకుతోందంటూ జనంలో ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్కు అధికారులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు, సిబ్బందికి వైరస్ సోకుతోందని, అది సహజమని అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మందికి కరోనా సోకిందని.. దేశంలో 10 వేల మంది హెల్త్ సిబ్బందికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 153 మంది హెల్త్ స్టాఫ్కు వైరస్ సోకిందని వివరించారు. ఇతర రోగాలు ఉన్నవారే కరోనాతో చనిపోతున్నారని, రాష్ట్రంలో నమోదైన మరణాల్లో 95 శాతం అట్లాంటివేనని చెప్పారు.
ఆ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగించండి
పంటలు ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 15 వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఆ జిల్లాల్లో కొనుగోళ్లు కొనసాగించాలన్నారు.
హైకోర్టు చెప్పినట్టు చేయలెం
కొందరు కోర్టులో పిల్స్ వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తోందని, వైద్య సేవలు అందించడంలో ఇబ్బంది అవుతోందని అధికారులు సీఎంకు చెప్పారు. రాష్ట్రంలో ఏదో మూలన, ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారని.. వారికి టెస్టులు చేయడమే పనిగా పెట్టుకుంటే, హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల రోజూ సగటున వెయ్యి వరకు చనిపోతుంటారని చెప్పారు. హాస్పిటళ్లకు రకరకాల జబ్బులతో వచ్చేవాళ్లు, డెలివరీ కోసం వచ్చే గర్భిణులు ఉంటారని.. ఇప్పుడు కరోనాతో వస్తున్నవారు అదనమని చెప్పారు. డబ్ల్యూహెచ్ వో గానీ, కేంద్రం గానీ, ఐసీఎంఆర్గానీ డెడ్బాడీలకు టెస్టులు చేయాలని చెప్పలేదన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఆచరణ యోగ్యం కాదని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్