కూలుస్తం, పేలుస్తం అంటే కాళ్లు రెక్కలు విరిచిపడేస్తరు : సీఎం కేసీఆర్

కూలుస్తం, పేలుస్తం అంటే కాళ్లు రెక్కలు విరిచిపడేస్తరు : సీఎం కేసీఆర్

కొత్త సచివాలయం, ప్రగతి భవన్‌లపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. అలాంటి పనులు చేయాలనుకునేవారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారని సీఎం హెచ్చరించారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు.

ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. 

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి  ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ గా మారుస్తామని బండి  ప్రకటించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సభలో స్పందించిన సీఎం కేసీఆర్ రేవంత్, బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు.