కేటీఆర్ సీఎం కావాలనే సెక్రటేరియట్ కూల్చిండు

కేటీఆర్ సీఎం కావాలనే సెక్రటేరియట్ కూల్చిండు
  • కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపాలె
  • ఎన్నికలు ఉంటేనే సీఎంకు జనం గుర్తొస్తరు: వివేక్ వెంకటస్వామి 
  • కేటీఆర్ సీఎం కావాలనే సెక్రటేరియట్ కూల్చిండు 
  • ధర్మపురికి కాళేశ్వరం నీళ్లు చుక్క కూడా రాలేదని ఫైర్ 

జగిత్యాల/ధర్మపురి, వెలుగు: ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లాలో వివేక్ పర్యటించారు. బుగ్గారం మండలం గోపులాపూర్ లో దాదాపు 100 మంది మహిళలు, 50 మంది ఇతర పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరగా.. వారికి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఇంటికొక ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కరికన్నా ఉద్యోగం ఇవ్వలేదు. కానీ తన ఇంట్లో గోలీలు ఇచ్చేటోళ్లకు కూడా పదవులు ఇచ్చారు” అని వివేక్ విమర్శించారు. ‘‘పాత సెక్రటేరియట్ వాస్తుకు లేదని, అది ఉంటే కేటీఆర్ సీఎం కాలేడని కేసీఆర్ దాన్ని కూల్చిండు. ప్రజాధనం వృథా చేసి, ఇప్పుడు కొత్తది కడుతుండు” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ధర్మపురి నియోజకవర్గ రైతులు 1,300 ఎకరాలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు పొలాలకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టులో వచ్చిన కమీషన్ల డబ్బునే కేసీఆర్ ఎన్నికల్లో పంచుతున్నాడని ఆరోపించారు. 

పింఛన్లు, ఇండ్లు ఇస్తలేరు... 
బుగ్గారం మండలంలోని బీరుసాని, సిరికొండ, గోపులాపూర్ గ్రామాల్లో బీజేపీ జెండాలను వివేక్ ఆవిష్కరించారు. పింఛన్లు, ఇండ్లు ఇస్తలేరని, సొంత జాగ ఉన్నా ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తలేరని బీరుసాని గ్రామానికి చెందిన మహిళలు, వృద్ధులు వివేక్ దగ్గర గోడు వెల్లబోసుకున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వని కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్, బిడ్డ కవితలకు మాత్రం ఫామ్ హౌస్ లు కట్టించాడని వివేక్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి 50 లక్షల ఇండ్లు కట్టాడని, మరి రెండోసారి అధికారంలోకి వచ్చి కేసీఆర్ ఎన్ని ఇండ్లు కట్టాడని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ లో ఇండ్లు, కొత్త పెన్షన్లు రావని, రుణమాఫీ జరగదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కారును పంక్చర్ చేసి, కమలాన్ని వికసింపజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్ వచ్చాక అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  

ధర్మపురిలో ప్రత్యేక పూజలు.. 
ధర్మపురి, వెల్గటూర్ మండలం కిషన్ రావుపేటలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల్లో వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురికి వేలాది మంది భక్తులు వస్తున్నారని, ఇక్కడ ప్రభుత్వం మరిన్ని సౌలతులు కల్పించి టూరిస్టు స్పాట్ గా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి సూర్యనారాయణ, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్, రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, తిరుపతి రెడ్డి, చక్రపాణి, మహేశ్, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.