భారీ కాన్వాయ్ తో మునుగోడుకు సీఎం కేసీఆర్

భారీ కాన్వాయ్ తో  మునుగోడుకు సీఎం కేసీఆర్

మునుగోడు నియోజకవర్గంలో ఇవాళ టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మునుగోడుకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు. మునుగోడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకోనున్నారు.  సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్‌ను సిద్ధం చేశారు. 
 

భారీగా జన సమీకరణ
మునుగోడు ప్రజా దీవెన బహిరంగ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాయి. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ రేమ రాజేశ్వరి సభాస్థలి వద్ద పనులు పరిశీలించారు. సభను సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ ఇన్ చార్జీలను నియమించారు. 

ట్రాఫిక్ ఆంక్షలు
మునుగోడు సభ నేపథ్యంలో టీఆర్ఎస్ భారీ కాన్వాయితో ర్యాలీకి ప్లాన్ చేశారు. దాదాపు నాలుగు వేల కార్లతో సీఎం కేసీఆర్కు స్వాగతం పలికి మునుగోడు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ సభ నేపథ్యంలో మనుగోడులో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు.

• విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా ట్రాఫిక్ మళ్లింపు

• మునుగోడులో సాయంత్రం 4 గంటలకు సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్

• ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు మొత్తం 2 వేల మంది బందోబస్తు

• సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో చర్లగూడెం, కిష్టరాంపల్లి భూ నిర్వాసితుల ముందస్తు అరెస్టులు


పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
మునుగోడు సభకు హాజరయ్యే జనానికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. సభకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్క్‌ చేసే విధంగా పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. ఇందుకోసం100 ఎకరాల్లో 10 చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేశారు.