వలసల వనపర్తిని వరిపంటల వనపర్తి చేశాం : కేసీఆర్​

వలసల వనపర్తిని వరిపంటల వనపర్తి చేశాం : కేసీఆర్​

గత తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణ రాష్ర్టంలో ఏం అభివృద్ధి జరిగిందానేది ప్రజల కళ్ల ముందు ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి అన్నింట్లోనూ అన్యాయం చేశారని చెప్పారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మొనగాడు ఎవరో మీ అందరికీ తెలుసన్నారు. ఈనాడు మాట్లాడేవాళ్లు ఎవరో.. అనాడో పొట్లాడిన వాళ్లు ఎవరో ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. అనాడు తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుంటే నోరుమూసుకుని కూర్చున్నదెవరో ప్రజలకు తెలసన్నారు. గొంతు చించుకుని పోరాటింది ఎవరో కూడా తెలుసన్నారు. 

కొడంగల్​కి రా అని ఒకరు, గాంధీబొమ్మకి రా అని ఒకరు.. దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ కాంగ్రెస్​నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వారంతా కేసీఆరులే అని అన్నారు. తాము కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇవాళ సుమారు లక్ష ఎకరాలకు నీరు అందుతోందని చెప్పారు. ధరణి వల్ల ఇవాళ సమాజం శాంతియుతంగా ఉందన్నారు. ధరణి లేకపోతే ఎన్ని కోట్లాటలు, ఎన్ని గొడవలు, కోర్టు కేసులు, ఎన్ని హత్య కేసులు జరిగేవి అని అన్నారు. ధరణి ఉండాలో వద్దో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. ధరణి పోర్టల్ ను తీసేస్తామని రాహుల్​గాంధీ, మల్లు భట్టి విక్రమార్క వంటి నాయకులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనాడు వనపర్తికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. అనాడు కాంగ్రెస్ నాయకులు ముస్లిం ఓట్లను వాడుకుని వారిని పేదలుగా ఉంచారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనివిధంగా ఉచితంగా 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు, దళిత బందు అనే పదం కూడా కేసీఆరే పుట్టించారని చెప్పారు. వాల్మీకి హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.