అధికారులు ఉద్యోగ కేంద్రాలను వదిలి వెళ్లొద్దు

అధికారులు ఉద్యోగ కేంద్రాలను వదిలి వెళ్లొద్దు

మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయంగా పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలను కాపాడుకొనేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సూచించారు. తక్షణమే సర్క్యూలర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎలా వస్తున్నాయనే విషయాలను నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం కేసీఆర్ కు వివరించారు. రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వానలు, వరదలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

గోదావరి నదికి పోటెత్తుతున్న వరద 

భారీ వర్షాలతో గోదావరి నది జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతోందని కేసీఆర్ అన్నారు. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నట్లు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటున్నాయన్నారు. ఇపుడు కురిసే వానలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ క్రమంలో... గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగా వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతో పాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎండి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పవర్ పాయింట్ ప్రజంటేషన్ 

మరోవైపు.. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం.. ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు చూపెట్టారు. వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు. వాతావరణ శాఖ అంచనా వేస్తోందని..కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతోందన్నారు. ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ వెల్లడించారు.