ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టేసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా చూడనట్టు కూర్చోవడం సరికాదని.. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారితేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఎల్బీ స్టేడియంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఈతరంపై ఉందన్నారు.
పేదల ఆశలు ఇంకా నెరవేరలేదని..స్వాతంత్య్ర ఫలాలు అందలేదని అనేక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అనేక వర్గాల ప్రజలు తమకు న్యాయం జరగలేదనే భావనలో ఉన్నారన్నారు. కేశవరావు కమిటీ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కేసీఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా సురవరం ప్రతాప రెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్ గౌతమ్, కొమరం భీం వారసుడు కుమరం సోనేరావు, కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, వనజీవి రామయ్య, రావెళ్ల వెంకట్రామారావు తనయుడు రావెళ్ల మాధవరావు, బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ, బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తదితరులను కేసీఆర్ సన్మానించారు.