ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది?

భీంగల్, వెలుగు: రూ.500 కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌‌ గల్ఫ్ కార్మికులను మోసగించారని బీజేపీ నేత డాక్టర్‌‌ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన చేస్తున్న జనంతో మనం పాదయాత్ర ఆదివారం 13వ రోజు భీంగల్‌ ‌‌మండలం సికింద్రపూర్‌ గ్రామం‌ నుంచి గోనుగొప్పుల, ముచ్చూర్‌ పిప్రి, బాచంపల్లి మీదుగా పల్లికొండ వరకు కొనసాగింది.  భీంగల్ మండలంలో యాత్రకు అనూహ్య స్పందన లభించింది.  ఈ సందర్భంగా మల్లికార్జున్‌రెడ్డి  మాట్లాడుతూ టీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి అన్నివర్గాల ప్రజలను మోసగించిందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, భీంగల్‌మండల అధ్యక్షుడు ములిగె మహిపాల్‌, బీజేవైఎం ఇన్‌చార్జి కనికరం మధు తదితరులు  పాల్గొన్నారు.

సీఎం సమీక్షలో ఇందూరు ముచ్చట

నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతి భవన్‌ నుంచి సీఎం నిర్వహించిన సమీక్షలో నిజామాబాద్ నగరంలో అభివృద్ధిపై మాట్లాడారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖలన్ని సమన్వయంతో పనిచేసి ఇందూరును డెవలప్‌ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటరామిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేశ్‌గుప్తాతో పాటు జీవన్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్పౌజ్ బదిలీల సమస్య పరిష్కరిస్తా

నిజామాబాద్, వెలుగు: స్పౌజ్ టీచర్ల బదిలీల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకు చెందిన మహిళా టీచర్లు ఆదివారం బాన్సువాడలో స్పీకర్‌‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇందుకు ఆయన స్పందిస్తూ తక్షణమే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫోన్ చేసి సమస్యపై  ఆరా తీశారు. త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మనోజ, విజయలక్ష్మి,చంద్రకళ, శ్రీలత, నరేశ్‌, సుధాకర్, సమద్ పాల్గొన్నారు.

ముదిరాజ్‌లను బీసీ(ఏ)లో చేర్చొద్దు

నిజామాబాద్, వెలుగు: ముదిరాజ్‌లను బీసీ (ఏ) గ్రూప్‌లో చేర్చొద్దని బీసీ(ఏ) ఐక్య వేదిక రాష్ట్ర నాయకుడు డాక్టర్ రమేశ్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కాలేజీలో బీసీ(ఏ) కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్‌ సమావేశం నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ(ఏ) గ్రూప్‌లో చేర్చితే ఇందు లో ఉన్న 56 ఉప కులాలకు విద్యా, ఉద్యోగాల్లో 7 శాతం రిజర్వేషన్లపై తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కుల వృత్తులు, భిక్షాటనపై ఆధారపడి జీవిస్తూ.. బలహీన ప్రజలు ఉన్న బీసీ(ఏ)లో ముదిరాజ్‌లను చేర్చొద్దన్నారు. సమావేశంలో గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి తోపారం కిషన్, నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య, నాయీ బ్రాహ్మణ సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరిగల నరహరి, రజక సంఘం ఉపాధ్యక్షుడు వీరేందర్‌‌, మేధర సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్, వ డ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్‌ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం  నగరంలో ని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక  కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి బాసర అఖిల భారత పద్మశాలి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు రాపోలు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా వంద మందికి పైగా వధూవరులు పరిచయం చేసుకున్నారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య, యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంజయ్‌ యాత్రను సక్సెస్​ చేయాలి

నవీపేట్, వెలుగు: ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్​ చేయాలని  బోధన్ నియోజకవర్గ సీనియర్ లీడర్ మోహన్‌రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సోమవారం బైంసాలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు ర్యాలీగా వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాధ, సర్పంచ్ సరిన్, రచ్చ సుదర్శన్, వంశీ, ఆనంద్, మువ్వ నాగేశ్వర్‌‌రావు పాల్గొన్నారు.  

ఓటరు నమోదును  పరిశీలించిన కలెక్టర్‌‌ 


కామారెడ్డి, వెలుగు: సదరం డేటా ఆధారంగా దివ్యాంగులను గుర్తించి వారి పేర్లను ఓటరు లిస్టులో నమోదు చేయించాలని  బీఎల్వోలకు కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఆదివారం అడ్లూర్‌‌లో నిర్వహిస్తున్న బూత్ లెవల్ ఓటర్ల నమోదు పక్రియను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా ఓటర్ల సంఖ్య, యువకుల సంఖ్యతో పాటు, కొత్తగా నమోదు చేసుకుంటున్న వారి వివరాలు తెలుసుకున్నారు.  18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.  

బీజేపీతోనే  సమస్యల పరిష్కారం

పిట్లం, వెలుగు: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార సూచించారు. ఆదివారం ఆమె బిచ్కంద మండలం పత్లాపూర్, కందర్‌‌పల్లి, రాజుల్లా గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై జనం విసిగిపోయారన్నారు. అనంతరం కార్యకర్తల   ఇంట్లో 
మన్​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని తిలకించారు. ఆమె వెంట బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, గిరిజన మోర్చా కార్యదర్శి జాదవ్ పండరి, హన్మంత్​పటేల్, సంతోష్‌రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.