
- కరోనా, వ్యవసాయంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
రాష్ర్టంలో కరోనా పరిస్థితి, వానాకాలం పంటలు, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపై చర్చించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా, ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాల పంటలకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఎలా ఉంది, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా సమావేశంలో చర్చించనున్నారు.