టికెట్ ​నాకే అని సీఎం చెప్పిండు: వనమా వెంకటేశ్వరరావు

టికెట్ ​నాకే అని సీఎం చెప్పిండు: వనమా వెంకటేశ్వరరావు
  • లంచ్ ​పెట్టి మరీ కొత్తగూడెంపై మాట ఇచ్చిండు
  • నెలన్నరలో ఎలక్షన్​ నోటిఫికేషన్​  
  • జల్ది  పనులు కంప్లీట్​చేయండి..లేదంటే మర్యాద దక్కదు 
  • ఆఫీసర్లకు వనమా హెచ్చరిక  


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘ఇటీవల సీఎం కేసీఆర్​నన్ను లంచ్​కు ప్రగతిభవన్​పిలిచిండు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్​తరుపున నువ్వే పోటీ చేయాలని చెప్పిండు. నేను అడిగిన అన్ని పనులకు సాంక్షన్​ఇచ్చిండు.. నెల, నెలన్నరలోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ వస్తది.. నియోజకవర్గంలో డెవలప్ మెంట్​పనులు స్పీడ్​గా చేయాలె..లేదంటే మర్యాద దక్కదు’ అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆఫీసర్లను హెచ్చరించారు.
 కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్​లో పలు శాఖల జిల్లా, మండల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. తాను సీఎంను ప్రగతిభవన్​లో కలిసినప్పుడు పాల్వంచ గవర్నమెంట్​హాస్పిటల్​ను 100 బెడ్స్​గా మార్చాలని అడగ్గానే హరీశ్​రావుకు ఫోన్​ చేసి చెప్పారని, హెలీ కాప్టర్​లో వెళ్లి శంకుస్థాపన చేసి రావాలని సూచించారని అన్నారు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్​ మండలాల్లో అభివృద్ధి పనులకు రూ. 96కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులకు శంకుస్థాపన చేసి రావాలని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్​ చేసి ఆదేశించారన్నారు. 
కొత్తగూడెం మున్సిపాలిటీకి రూ.115 కోట్లు, పాల్వంచకు రూ.100కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ పనులకు దశలవారీగా శుక్రవారం నుంచి శంకుస్థాపనలు చేయనున్నట్టు ఎమ్మెల్యే వనమా తెలిపారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. టైం తక్కువగా ఉందని,  నియోజకవర్గంలోని పనులన్నీ 25రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో వేగం పెంచకపోతే మర్యాద దక్కదని హెచ్చరించారు. 
కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తాగునీరివ్వాలని మిషన్​ భగీరథ ఆఫీసర్లను ఆదేశించారు. నియోజకవర్గంలో మన ఊరు, మన బడి పనులు స్లోగా సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో 76జీవో ప్రకారం పెండింగ్​లో ఉన్న పట్టాల పంపిణీకి ఏర్పాటు చేయాలని తహసీల్దార్​ను ఆదేశించారు. నేషనల్​ హైవే పనుల్లో జాప్యంపై ఆర్అండ్​బీ ఆఫీసర్లపై ఫైర్​ అయ్యారు. 
కాగా, అధికారిక రివ్యూ మీటింగ్​లో బీఆర్ఎస్​నేతలు పాల్గొని అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పనులు చేయట్లేదని, లేట్​చేస్తున్నారనడంతో ఎమ్మెల్యే ఆఫీసర్లపై ఫైర్​అయారు. ఎమ్మెల్యే కొడుకు రాఘవ ఎప్పటికప్పుడు వనమాకు స్లిప్పులు పంపించడం కనిపించింది. జడ్పీ వైస్​ చైర్మన్​కంచర్ల చంద్రశేఖర్​, మున్సిపల్​ చైర్​పర్సన్​కె. సీతాలక్ష్మి, డీసీహెచ్ఎస్​ డాక్టర్​రవిబాబు, విద్యుత్​శాఖ ఎస్ఈ రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్​సుకృత, జిల్లా జనరల్​ హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​ కుమారస్వామి, పాల్వంచ హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​ ముక్కంటేశ్వరరావు పాల్గొన్నారు.