
హైదరాబాద్ : లాక్ డౌన్ లేకపోతే మనం చాలా ప్రమాదంలో పడేవాళ్లమన్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రజలకు ధన్యావాదాలని, మంచి స్పందన ఉందన్నారు.. ఇన్ని పెట్టినా ఒక్క రోజులో 10 కేసులు వచ్చాయంటే సీరియస్ నెస్ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇంకా బాగా లాక్ డౌన్ పాటించాలన్నారు. దీన్ని క్యూర్ చేయడానికి మందు లేదని.. వ్యాప్తిని నివారించడమే మందు అన్నారు. న్యూయార్క్ లో 11 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేశారని..వాళ్లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 వేలు కావాలన్నారు.
అగ్రదేశం అమెరికాలోనే ఆగమాగం అయ్యిందని .. మనకు ఆ స్థాయిలో రాకుండా చూసుకోవాలన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మన చేతిలో ఉన్న ఆయుధం అని తెలిపారు కేసీఆర్. చైనా, అమెరికా స్థాయిలో మన దగ్గర వస్తే 20 కోట్ల మంది ఈ జబ్బు బారినపడుతామని అంచనాలు వస్తున్నాయన్నారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్న సీఎం ఏమైతదిలే అనే నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ధైర్యం కోల్పోలేదు.. పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు సీఎం.