నియంత్రిత పంటల విధానం పాటించాలి: సీఎం కేసీఆర్

నియంత్రిత పంటల విధానం పాటించాలి: సీఎం కేసీఆర్

నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదు
వ్యవసాయ శాఖలో మరో రెండు అనుబంధ విభాగాలు
రాబోయే రోజుల్లో వ్యవసాయం యంత్రాలతోనే
వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్

తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న మూడే మూడు ప్రధాన పంటలుగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సీజన్ లో పత్తి 53 లక్షల ఎకరాలలో, వరి 79 లక్షల ఎకరాలలో, మొక్కజొన్న 20 లక్షల ఎకరాలలో రైతులు పండించారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయ విధానం, రైతులు పండిస్తున్న పంటలు, పండించాల్సిన పంటల గురించి చర్చించారు.

ప్రధాన పంటలు వేయోద్దనేది తమ ఉద్దేశం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలలో సోయా, మూడున్నర లక్షల ఎకరాలలో కూరగాయలు, లక్షా 25 వేల ఎకరాలలో పసుపు, ఏడు లక్షల ఎకరాలలో కందులు పండించారు. మరో రెండున్నర లక్షల ఎకరాలలో ఇతర పంటలు వేశారు. రెండు నెలలుగా నేను, మంత్రులు మరియు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అనేక పరిశోధనలు చూశాం. దాంతో మాకు కూడా కొంత అవగాహన కలిగింది. నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదు. ఎక్కడ, ఏ పంట, ఎంత విస్తీర్ణంలో, ఎప్పుడు వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే నియంత్రిత పంటల విధానం. మన శాస్త్రజ్ఞులు మంచి దిగుబడితో పాటు.. మంచి రాబడి వచ్చే పంటలను సూచిస్తారు. మనం గత ఏడాది 79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశాం. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుంది. అప్పుడు పూర్తిగా వరి పంట వేస్తే.. నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుంది. అంత పెద్ద మొత్తంలో వరి దిగుబడి వస్తే తట్టుకునే శక్తి మరియు బియ్యం తయారు చేయగల శక్తి మన దగ్గర ఉన్న రైస్ మిల్లర్లకు లేదు. మన మిల్లర్లు కోటి 75 లక్షల టన్నుల వరి మాత్రమే మిల్లింగ్ చేస్తారు. కనుక పంటలు వేసే ముందు లాభసాటి అనే అంశాన్ని ఆలోచనలోకి తీసుకోవాలి.

ఈ సంవత్సరం కరోనా వల్ల వరి ధాన్యాన్ని కొన్నాం. అంతేకానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలరు. రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారు. మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయలు గరిష్టంగా మిగులుతుంది. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు. గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశారు. ఈ సారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలి. వరిని మాత్రం 40 లక్షల ఎకరాలలో సాగు చేయవచ్చు. ఇందులో దొడ్డు రకాలు మరియు సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు. ఇక కందుల విషయానికొస్తే 12 లక్షల ఎకరాలలో సాగు చేయాలి. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.

ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు. వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాలంటే యాసంగిలో మొక్కజొన్న వేయండి. బీహార్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మొక్కజొన్న క్వింటాలు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. మన దగ్గర 1700 రూపాయలు రావాలంటే ఎవ్వరు ఇవ్వరు. కనుక రైతులు ఈ వాన కాలంలో మొక్కజొన్న వేయకండి. ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి, కూరగాయలు, సోయా, పప్పు ధాన్యాలు మరియు ఇతర పంటలు వేయండి. మన రాష్ట్ర పంటలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలి. దేశంలో తెలంగాణ బియ్యానికి గాని, కందిపప్పుకు గాని ఎక్కువ డిమాండ్ ఉండాలి. బియ్యపు గింజ కనీసం 6.5 మిల్లీమీటర్ల సైజులో రావాలి. అలా ఉన్న దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రైతులు విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకండి. పత్తికి కావలసిన విత్తనాలు మంచివి అందుబాటులో ఉన్నాయి. వరి విత్తనాలను సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తారు.

వ్యవసాయ శాఖలో మరో రెండు అనుబంధ విభాగాలు

రాబోయే ఆరు నెలలలో ప్రతి క్లస్టర్ లోను రైతు వేదిక నిర్మించాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా నిలబడుతుంది. త్వరలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను ఏర్పాటు చేస్తాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వాటిని నిర్మిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు ఖాళీగా ఉండకూడదు. జిల్లా కలెక్టర్లు వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన AEO పోస్టులను భర్తీ చేయాలి. రైతుబంధు పథకం డబ్బులను నియంత్రిత వ్యవసాయ పద్ధతిలో ఎక్కువ మేర తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లు పోటీ పడాలి. వ్యవసాయ శాఖలో మరో రెండు అనుబంధ విభాగాలు త్వరలో అమలులోకి వస్తాయి. మొదటిది రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. రెండవది మార్కెటింగ్ వింగ్. ప్రతి మండలంలో పంటలు సాగు చేసేందుకు యాంత్రిక శక్తి ఎంత ఉందనే అనే లెక్క ఆ మండల వ్యవసాయ అధికారి దగ్గర ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. వ్యవసాయ యంత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

For More News..

అభిమానులకు జూ. ఎన్టీఆర్ లేఖ

సోదరునితో అక్రమసంబంధం అంటగట్టిన పోలీసులు

తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్