బీడీలు చేసేటోళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నా..

బీడీలు చేసేటోళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నా..

యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. దళిత వాడల్లో కాలినడకన పర్యటిస్తూ సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి ప్రతి ఒక్కరి యోగక్షేమాలు మరియు కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరినీ దళితబంధు పథకం గురించి తెలుసా అని అడిగారు. ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు? దళితబంధు డబ్బులు వస్తే ఏంచేద్దామని అనుకున్నారు అని సీఎం ప్రశ్నించారు? కొంతమంది మిల్క్ డైరీ ఫాం పెట్టుకుంటామని, కొందరు ట్రాక్టర్‌లు కొంటామని, మరికొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు తెలిపారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ... మీకు పెన్షన్ వస్తున్నదా.. అని ఆరా తీశారు. పెన్షన్ రానివాళ్ళు ఎవరైనా ఉంటే.. వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళితబంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు. దళిత కుటుంబాలతోపాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని.. దిగులు పడొద్దని సీఎం వారికి భరోసానిచ్చారు. నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ ఇండ్లు రోడ్డకు దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడు మొత్తం నీటితో నిండిపోతున్నాయని పలువురు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నందున కాలనీల రోడ్లు, డ్రైనేజీలు ఒక ప్లాన్ ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించిన సుమారు 20 మంది బీడీ మహిళా కార్మికులకు రెండు రోజుల్లో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. ఒక మహిళ.. బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్పబోతుండగా.. ‘నేను బీడీలు చేసేటోళ్ళ ఇంటిలో ఉండే చదువుకున్నా.. వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా’ అని సీఎం వాఖ్యానించారు.  

పర్యటనలో భాగంగా.. ఒక దళిత కుటుంబం ఇంటి దగ్గర ఆగినప్పుడు వాళ్ళు తమ కూతురుకి ఏదైనా సహాయం చేయాలని సీఎంకు విన్నవించారు. తమ అల్లుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని చెప్పడంతో.. దళితబంధు కింద అతనికి ట్రాక్టర్ ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో పక్కనే వున్న ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను చూపిస్తూ ఈయన మీకు తెలుసా? దళిత నాయకుడు ‘ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’అని పాట రాసింది ఈయనే అని సీఎం వారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరిని పెన్షన్ వస్తుందా? 24 గంటల కరెంట్ వస్తుందా? సాగు నీళ్ళు వస్తున్నాయా? రైతుబంధు డబ్బులు వస్తున్నయా? ఏమేం పంటలు సాగు చేస్తున్నారు? అని సీఎం ఆయా కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్ధుల దగ్గరకు వెళ్ళి పెన్షన్‌లో కొంత భాగమైనా పక్కకు పోదుపు చేసుకుంటున్నరా? అని ఆరా తీశారు. గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా వున్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు కేటాయించి పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

సీఎం మద్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు కాలినడకన పర్యటించారు. ముఖ్యమంత్రి వెంట శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటీ వెంకన్న, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ అంజనేయులు, కవులు, రచయితలు మిట్టపల్లి సురెందర్, సాయిచంద్, అంబటి వెంకన్న, అభినయ్ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస్, బూర సతీష్, మానుకోట ప్రసాద్, బాబు, శివ, బిక్షపతి తదితరులు ఉన్నారు.