పాట్నా: మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ను ఓ ప్రయోగశాలగా మార్చేసిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ ప్రస్తుతం ప్రత్యేక హోదా కోల్పోయిందని, రాష్ట్రాన్ని విడదీసి రెండు కేంద్రపాలిత కేంద్రాలుగా విభజించారన్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్తో ప్రయోగాలు చేస్తున్నదని ముఫ్తీ మండిపడ్డారు.
పాట్నాలో ప్రతిపక్షాలు సమావేశమైన ఒకరోజు తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం మొత్తాన్ని ‘కాశ్మీరీకరణ’ చేసే ముప్పు ఉందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారని, ముగ్గురు మాజీ సీఎంలతో సహా కాశ్మీర్ నేతలను జైలులో పెట్టారని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఢిల్లీలో కేంద్రం చేసిన ఆర్డినెన్స్ ను గతంలో జమ్ము కాశ్మీర్లోనూ చేశారు. అప్పుడు దాని వెనుక నేను ఉన్నట్లు కొంతమంది అపార్థం చేసుకున్నారని పీడీపీ చీఫ్ తెలిపారు.