
హైదరాబాద్, వెలుగు: కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.
ఇక నుంచి ప్రతి 4 వారాలకు ఓసారి కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులపై సమీక్ష చేస్తానని, సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. కొండగల్లో చేపల మార్కెట్ ఏర్పాటునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మద్దూరులో సమీకృత గురుకుల సముదాయం నిర్మాణంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.