రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎం సహాయనిధి స్కాంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జులై 1న ఈ స్కాం నిందితులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ ఆధార్, ఫేక్ సర్టిఫికేట్, తప్పుడు బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ఫండ్ డబ్బుల్ని దారి మళ్లించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతుండటంతో కేసుని సీఐడీకి బదిలీ చేశారు.
ఇప్పటికే సైఫాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. మిర్యాల గూడ కేంద్రంగా సాగిన ఈ స్కాం.. రాష్ట్రమంతటా విస్తరించింది. ఈ క్రమంలో స్కాంపై పూర్తి స్థాయిలో సీఐడీ దృష్టి సారించింది. అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. సీఎం సహాయనిధి నిధులు కాజేసేందుకు నిందితులంతా కుమ్మక్కై డబ్బు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.