మొంథా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ ఆరా.. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారుల‌కు ఆదేశం

మొంథా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ ఆరా.. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారుల‌కు ఆదేశం

మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం రేవంత్  బుధ‌వారం (అక్టోబర్ 29) సమీక్ష నిర్వహించారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం... ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన ఉండటంతో ఎటువంటి న‌ష్టం వాటిల్లకుండా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. 

మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి జిల్లాలైన ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌,  న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండ‌డంతో ఆ జిల్లాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నక‌ల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు దారి మ‌ళ్లించిన క్రమంలో ప్రయాణికుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స‌మ‌న్వయం చేసుకోవాల‌ని.. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాల‌కు త‌గిన మార్గద‌ర్శక‌త్వం వ‌హించాల‌ని సీఎం సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది, రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్పటిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. 

పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌న్నారు.  పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్యవేక్షణ చేయాల‌ని సీఎం ఆదేశించారు. తుఫాను ప్రభావంతో వ‌ర్షపు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబ‌లే ప్రమాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని... అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.  

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వ‌హించాల‌ని సీఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వయంతో సాగాల‌ని సీఎం సూచించారు.  హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రజ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్షణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.